YS Jagan : ఎవరైనా మాటలను పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న మాట తూలితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకసారి మాట జారితే వెనక్కి తీసుకోలేం కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) ఇలాంటి తప్పిదాలకే పాల్పడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డి పై ఆయన చేసిన కామెంట్స్ అలానే ఉన్నాయి. క్యారెక్టర్ పై ఆయన మాట్లాడేసరికి విజయసాయిరెడ్డి కూడా మనస్థాపానికి గురయ్యారు. అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. తనకు క్యారెక్టర్ ఉంది కాబట్టే ప్రలోభాలకు లొంగలేదని ధీటుగా సమాధానం చెప్పారు. తద్వారా జగన్ కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు జగన్ విషయంలో అభిమానంగా మాట్లాడే విజయసాయిరెడ్డి ఒక్కసారిగా వ్యతిరేకంగా మాట్లాడేసరికి.. అది సంచలనంగా మారింది.
* అత్యంత ఆత్మీయుడు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. వైయస్సార్ కుటుంబానికి ఆడిటర్ గా ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరయ్యారు. పారిశ్రామికవేత్తగా మారిన జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అది మొదలు ఆయన సామ్రాజ్యానికి ఒక రక్షకుడిగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి పై కేసులు నమోదైతే.. విజయసాయి రెడ్డి సైతం ఆయనతోపాటు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసుల్లో ఏ2 నిందితుడిగా మారారు. 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఆ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం వెనుక కూడా ఆయన పాత్ర అమోఘం. అటువంటి వ్యక్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ తగినవి కావు అన్నది విశ్లేషకుల అభిప్రాయం.
* వారందరినీ లైట్ తీసుకున్న జగన్
వైసీపీ( YSR Congress ) ఓటమి తర్వాత చాలామంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంతో సన్నిహితులు, వైసీపీలో కీలక పదవులు అలంకరించిన వారు సైతం జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. దానిని లైట్ తీసుకున్నారు జగన్. కానీ విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. ఏకంగా విజయసాయిరెడ్డి క్యారెక్టర్ పై మాట్లాడారు. ఆయనకు క్యారెక్టర్ లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే తనకు క్యారెక్టర్ ఉంది కనుక ప్రలోభాలకు లొంగి పోలేదని.. మరో పార్టీలో చేరలేదని.. మూడున్నర సంవత్సరాల పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నానని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఒక విధంగా ఎంతో బాధతోనే విజయసాయిరెడ్డి స్పందించినట్లు అర్థమవుతోంది.
* అలా మాట్లాడకూడదు
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కఠినంగా మాట్లాడడం తగదు. అది ఆయనతో పాటు పార్టీకి నష్టం చేకూర్చుతుంది. ఎంతో పొదుపుగా మాటలు ఆడితేనే బాగుంటుంది. పార్టీలో తాను దూకుడుగా ఉంటూ.. ఉన్నవారితో రాజకీయాలు చేసుకుంటే చాలా మంచిది. కొందరు నేతలు కేసులకు భయపడి, మరి కొందరు నేతలు అరెస్టులకు ఆందోళనకు గురై పార్టీలు మారుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అలా కాదు. ఆయనకు కేసుల భయం ఉంది. అన్నింటికీ మించి కుటుంబం చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది ఒక ప్రాక్టికల్ గా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో ఓపెన్ అయిపోయారు. అనవసరంగా తనకు పడని వారి జాబితాలో ఆయనను చేర్చేశారు.