YS Jagan: ఇండియా కూటమి వైపు జగన్..టార్గెట్ షర్మిల.. పునరాలోచనలో కాంగ్రెస్!

జగన్ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సోదరి షర్మిలను నియంత్రించాలని భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ లతో పాటు షర్మిలను టార్గెట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 26, 2024 1:00 pm

YS Jagan

Follow us on

Ys jagan: ఈ ఎన్నికల్లో జగన్ కు దారుణ పరాజయం ఎదురయింది. వై నాట్ 175 అన్నారు జగన్. కానీ ఏపీ ప్రజలు మాత్రం కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసిపిని గెలిపించారు. అయితే ఇంతటి ఓటమికి కారణం ఏంటనేది వైసిపి విశ్లేషించుకుంది. పెద్ద ఎత్తున సమీక్షలు చేసింది. తరుణంలో షర్మిల రూపంలో జరిగిన డ్యామేజ్ అధికమని గుర్తించింది. ఎన్నికల్లో నష్టం చేకూర్చిన షర్మిల.. ఎన్నికల తరువాత కూడా జగన్ పై టార్గెట్ చేశారు. జగన్ ఈ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం అయితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆమె భావిస్తున్నారు. అందుకే వైసీపీని పూర్తిగా లేకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే జగన్ ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించారు. చంద్రబాబు, పవన్ తో పాటు షర్మిల కూడా తనకు శత్రువుగా భావిస్తున్నారు. అందుకే ముగ్గురిని టార్గెట్ చేసుకుని పావులు కదపడం ప్రారంభించారు. గత ఐదేళ్లుగా బిజెపితో సన్నిహితంగా మెల్లి గారు జగన్. ఇప్పుడు అదే బిజెపికి దగ్గరయ్యారు చంద్రబాబు. దీంతో బీజేపీతో స్నేహం కుదిరే పని కాదు జగన్ కు. అందుకే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి పక్షాలన్నీ హాజరయ్యాయి. సంఘీభావం తెలిపాయి. ఇండియా కూటమిలోకి ఆహ్వానించాయి. తద్వారా తనకు జాతీయ పార్టీల మద్దతు ఉందని జగన్ సంకేతాలు పంపించగలరు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగడానికి కూడా సిద్ధమయ్యారు. తద్వారా ఏపీలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నోరుమూయించే అవకాశాన్ని తెచ్చుకున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పగ్గాల నుంచి తప్పించాలని కూడా ప్రయత్నాలు చేస్తారు.అంటే ఏకకాలంలో చంద్రబాబు,పవన్, షర్మిలను దెబ్బ కొట్టే వ్యూహం అమలు చేస్తున్నారన్నమాట.

* కాంగ్రెస్ ను వంచించిన జగన్
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని జగన్ దారుణంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన ఆయన బలవంతంగా ఆ పార్టీని లాక్కున్నారు. అందుకే జగన్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఒక రకమైన కోపం ఉంది. షర్మిలకు పగ్గాలు అప్పగించారు అందులో భాగమే. కాంగ్రెస్ కు మించి కోపం ప్రదర్శించారు షర్మిల. ఈ ఎన్నికల్లో వైసీపీని దారుణంగా దెబ్బతీశారు. భారీగా డామేజ్ చేశారు. అయితే జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ వాయిస్ మారే అవకాశం ఉంది. జగన్ బిజెపిని విడిచిపెట్టి.. ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తే మాత్రం కాంగ్రెస్ పునరాలోచించే అవకాశం ఉంది.

* షర్మిలను లాక్ చేసే ఉద్దేశం
ఒకవేళ జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గుచూపితే.. కాంగ్రెస్ పార్టీ షర్మిలను కొంత నియంత్రించే అవకాశం ఉంది. మునుపటిలా వైసీపీని టార్గెట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇండియా కూటమిలోకి జగన్ వస్తే.. భాగస్వామ్య పార్టీగా గుర్తించాల్సి ఉంటుంది. 2029 ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీతో.. జాతీయస్థాయిలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితిలో ఉంది. ఏపీపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేయడం విశేషం.

* ఆ స్వేచ్ఛ ఇక ఉండదు
ఇప్పటివరకు షర్మిలకు కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. అందుకే ఆమె జగన్ ను టార్గెట్ చేసుకోగలిగారు. వైసిపి ఓడిపోయిన తరువాత కూడా ఆమె వెంటాడుతున్నారు. ఎటువంటి అంశాలకైనా వైసిపి వైఫల్యాలను అంటగడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉండనుంది పరిస్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే షర్మిలకు లాక్ చేసేందుకు జగన్ చేసిన వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.