Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరవుతారు అన్న ప్రచారం సాగుతోంది. ఈనెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కావడం లేదు. గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలతో హాజరయ్యారు జగన్. సభలో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మరోవైపు హాజరు విషయంలో అనర్హత వేటు తప్పదన్న సంకేతాల నడుమ సభకు హాజరయ్యేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది.
* ఆ రెండు అంశాలపై దుమారం..
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం, టిటిడి లడ్డూ కు సంబంధించి నెయ్యి కల్తీ అంశాలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి దారి తీశాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందని చెబుతుండగా కూటమి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక యుద్ధ వాతావరణం ఉంది. అయితే సభలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, నెయ్యి కల్తీ వ్యవహారంపై అధికార పార్టీ చర్చ జరిపే అవకాశం ఉంది. అన్ని రకాల ఆధారాలు బయటపెట్టి సభ ద్వారా ప్రజలకు వివరించేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుందన్న ప్రచారం నడుస్తోంది. అందుకే అధికార పార్టీ దూకుడు ఎదుర్కోవాలంటే సభకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* గత ఏడాది హాజరు..
గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు జగన్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కేవలం పది నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారు. అయితే శాసనసభ పని దినాల్లో 60 రోజులు దాటి హాజరు కాకుంటే మాత్రం తప్పకుండా వేటు పడే అవకాశం ఉంది. ఇదే విషయంపై కూటమి ప్రభుత్వం నుంచి హెచ్చరికలు వచ్చాయి. అందుకే జగన్ వైఖరి మారినట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజకీయ అంశాలు, ఇంకోవైపు అనర్హత వేటు తప్పించుకునేందుకు జగన్ సభకు వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే ఛాన్స్ వస్తుందన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అయితే అధికారిక ప్రకటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు రాలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.