India Vs Pakistan T20 World Cup: కొద్దిరోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు క్రికెట్ అభిమానులకు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా తర్కం లేని కారణంతో భారత జట్టుతో జరిగే మ్యాచ్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేనిపోని విమర్శలు చేయడం.. అనవసరమైన పంతాలకు పోవడంతో వివాదం ఏర్పడింది. అంతేకాదు మ్యాచ్ ఆడ బోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం ఏర్పడింది. మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగాయి. అనేక రకాలుగా సంప్రదింపులు జరిపాయి.
లాహోర్లో జరిగిన ఈ భేటీలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేనిపోని కోరికలు కోరింది. మ్యాచ్ ఫీజు విషయంలో.. ఇతర వ్యవహారాలలో తమకు వాటా పెంచాలని.. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు టి20 వరల్డ్ కప్ లో ఆడకపోయినప్పటికీ బంగ్లాదేశ్ జట్టుకు, ప్లేయర్లకు ఫీజు చెల్లించాలని కోరింది. అయితే పాకిస్తాన్ కోరికల మీద ఐసిసి సుముఖంగా స్పందించలేదు. పైగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వాస్తవం అర్థమైంది. పాకిస్తాన్ కు కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ హెచ్చరించిన నేపథ్యంలో.. వాస్తవం ఏమిటో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు అర్థమైంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ కూడా రాయడంతో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు గత్యంతరం లేకపోయింది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. ప్రభుత్వం కూడా భారత జట్టుతో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంలో శ్రీలంక క్రికెట్ జట్టు కీలకంగా వ్యవహరించింది. ముందుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు లేఖ రాసింది. అనేక విషయాలను చెప్పింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు లేఖ రాసింది. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరిన కోరికలను ఏమాత్రం పట్టించుకోకుండా.. అన్ని విధాలుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మీద ఒత్తిడి తేవడంలో ఐసీసీ విజయవంతమైంది. అందువల్లే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలవంచింది.. చివరికి భారత జట్టుతో మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. దీంతో ఫిబ్రవరి 15న యధావిధిగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. హోటల్ గదులు కూడా బుక్ అయ్యాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో జరిగే మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకోవడంతో అభిమానుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.