YSRCP Leaders Silence: గత కొద్ది రోజులుగా ఒక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో. తన తాతను చంపిన వారిని విడిచిపెట్టిన ఘనత తనది అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అది మొదలు వైయస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ల పై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు నరరూప రాక్షసులు అంటూ చాలామంది నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందులకు చెందిన టిడిపి నాయకుడు పేర్ల పార్థసారధి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ సైతం రాజారెడ్డి తో పాటు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిది రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించారు.ఇంత జరుగుతున్నా కడప జిల్లా వైసీపీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం విశేషం.
జగన్ ప్రెస్ మీట్ లో..
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం ఆరోపణలను ఖండించారు. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. గొడ్డలితోపాటు గన్ కల్చర్ టిడిపి హయాంలోనేనని ఆరోపించారు. అయితే అప్పటి నుంచి వైయస్ కుటుంబం చుట్టూ సోషల్ మీడియాలో విస్తృత దాడి జరుగుతోంది. ఒక గ్రామస్థాయి నాయకుడిగా ఉన్న పేర్ల పార్థసారధి రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో పార్థసారథి చేసిన కామెంట్స్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వైయస్ కుటుంబంలోని ముగ్గురు నేతలపై తీవ్ర ఆరోపణలు టిడిపి నుంచి వస్తున్నాయి. కానీ కడప జిల్లా వైసీపీ నేతలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు . దీంతో ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతం గా వెళ్తోంది. తమ అధినేత కుటుంబం పై ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే కనీసం స్పందించాలన్న రీతిలో కూడా వైసీపీ నేతలు ఇవ్వకపోవడం ఆశ్చర్యం వేస్తోంది.
సొంత వారు ఉన్నా..
కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇంతలా టిడిపి టార్గెట్ చేసుకుంటే అవినాష్ రెడ్డి కానీ.. రవీంద్రనాథ్ రెడ్డి కానీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకు ఎదురుగా నిలిచారు బీటెక్ రవి. టిడిపి శ్రేణులు కూడా ధైర్యంగా నిలబడ్డాయి. అటువంటి ధైర్యం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇలాంటి సమయంలో కూడా వైసీపీ నేతలు, అందులో దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు నోరు తెరవకపోవడం చూస్తుంటే.. ఇక రాజకీయం చేయడం ఎందుకని కడప జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
