Jagan Mohan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఆయన స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని గట్టిగానే ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఖచ్చితంగా అక్కడ ఇన్చార్జ్ పై వేటు వేస్తానని హెచ్చరిస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల వైసిపి అభ్యర్థులు ఉండాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. వైసిపి హయాంలో భయపెట్టి, ప్రలోభ పెట్టి నామినేషన్లను విత్ డ్రా చేయించి.. ఏ రీతిలో ఏకగ్రీవాలు జరిగాయో ఆయనకు తెలియంది కాదు. అధికార పార్టీగా ఉన్న వైసీపీ అలా చేసింది. దానికి కచ్చితంగా ఇప్పుడు బదులు తీర్చుకుంటుంది కూటమి. దానికి ఎదురెళ్లి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
* పులివెందుల జడ్పిటిసి ఫలితం..
మొన్ననే పులివెందుల జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా ఆయన అలా మాట్లాడడం ఏంటి అనేది వైసిపి నేతల ప్రశ్న. స్థానిక సంస్థలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ఆపై వ్యక్తిగతంగా ఎదుర్కొనక తప్పదు. పోనీ పార్టీ నుంచి ఏదైనా సాయం అందించే పరిస్థితి ఉందా అంటే అది లేదు. ఇప్పటివరకు అందించిన దాఖలాలు కూడా లేవు. చేసిన అభివృద్ధి పనులకే బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు కొత్తగా ఏం సాయం చేస్తారు? నేతల ఆర్థిక సాయం ఎలా ఉంటుంది? అనేది ఆయనకే తెలియాలి. సార్వత్రిక ఎన్నికల్లోనే నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా మిగిల్చుకున్నారన్న విమర్శ ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వారు ఖర్చు పెడతారు అంటే అది ఉత్తమాటే.
* బలిపీఠం ఎక్కించడమే..
ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిపీఠం ఎక్కిస్తారన్నమాట. ఏదైనా గెలవాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేస్తారు. అధికారం ఉంటే నాలుగు పనులు ప్రజలకు చేయవచ్చు అని భావిస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అంత ఖర్చు పెట్టి పార్టీ నేతలు నిలబెడితే.. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వెలగబెడతారు. పోనీ గెలిచిన తర్వాత ఆ నలుగురు తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. పైగా ఇప్పుడున్న ఇన్చార్జిల కే టిక్కెట్లు ఇస్తారు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే గత ఎన్నికల్లోనే 100 మంది వరకు టికెట్లను మార్చారు. ఒక నియోజకవర్గంలో గెలవలేని వారిని తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పోటీ చేయించారు. ఇప్పటికీ వారికి పాత నియోజకవర్గాలను కేటాయించలేదు. కొందరు ఇన్చార్జిలు అయితే ఇంకా యాక్టివ్ కాలేదు. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు జగన్. ఓడిపోతే ఓడిపోండి కానీ అభ్యర్థులు ఉండాల్సిందేనని చెప్పి.. తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు జగన్.
