CM Chandrababu: ఆ మీడియా అధినేత ‘దందా’.. చంద్రబాబుకు ముందే తెలుసా?

వైసిపి సంచలన ఆరోపణలు చేసింది కూటమి ప్రభుత్వంపై. టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో అడ్డగోలు వ్యవహారానికి తెర లేపారు అన్నది వైసిపి ఆరోపణ. అయితే ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం ఉందని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : October 24, 2024 2:46 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? ఆ మీడియాధిపతి బ్లాక్ మెయిల్ కారణమా? ఆయనపై వచ్చిన అభియోగాలతో ఆపారా? ఇప్పటికే ప్రభుత్వానికి ఆయన విషయంలో ఫిర్యాదులు వచ్చాయా? ఇప్పుడు అదే విషయాన్ని వైసిపి బయట పెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ప్రభుత్వం అంటూ వైసిపి సంచలన ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారాలు నడిపే వారితో.. సంబంధాలు ఉన్న మీడియా అధిపతికి టీటీడీ ట్రస్ట్ బోర్డు పదవి ఇస్తారా? అంటూ ప్రశ్నించిన సంగతి విధితమే.ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ట్రస్ట్ బోర్డు అంశం తెరపైకి వచ్చింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రచారం సాగింది. అటు తరువాత రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అశోక్ గజపతిరాజు, ఓ మాజీ న్యాయమూర్తి, సినీ నటుడు మురళీమోహన్.. ఇలా చాలా రకాల పేర్లు బయటకు వచ్చాయి.చివరకు టిడిపి అనుకూల మీడియాకు చెందిన.. ఓ ఛానల్ అధినేత పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం సాగింది.కానీ ట్రస్ట్ బోర్డును మాత్రం ఇంతవరకు నియమించలేదు.తిరుమలలో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి కానీ..బోర్డు నియామకం చేపట్టలేదు.

* ప్రారంభంలో చంద్రబాబు ఆసక్తి
అయితే ప్రారంభంలో ఆ మీడియా అధినేత విషయంలో చంద్రబాబు ఆసక్తి చూపారు. గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుగా నిలిచింది ఆ మీడియా. వైసీపీ విధ్వంసాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో సదరు మీడియా అధినేత తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో చంద్రబాబు సైతం కొంత సానుకూలత వ్యక్తం చేశారు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇటీవల సదరు మీడియా అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అపాయింట్మెంట్ సైతం ఇవ్వలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం లేదని తేలిపోయింది.

* టిడిపి నుంచి అభ్యంతరాలు
అయితే సదరు మీడియా అధినేత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన మాట వాస్తవమే. కానీ టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇవ్వడం పై అనేక రకాల అభ్యంతరాలు తెలుగుదేశం పార్టీ నుంచి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల టీటీడీ లడ్డు వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఎటువంటి వివాదాలు లేని వారికి ఆ పదవి అప్పగించాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇప్పుడు సదరు మీడియా అధినేత పై వైసీపీ చేసిన ఆరోపణలు ముందుగా చంద్రబాబు దృష్టికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాల క్రమంలోనే ఆ మీడియా అధినేత విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గారని తెలుస్తోంది.ప్రభుత్వానికి, చంద్రబాబుకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు వైసిపి బయట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.