Hybrid Mahanadu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడుకు ఒక చరిత్ర ఉంది. ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే అంతకుమించి ఈ ఏడాది నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడుకు మరో ప్రత్యేకత. ఏటా ఎన్టీఆర్ జన్మదినం నాడు రెండు రోజులపాటు మహానాడు ను నిర్వహించి.. పార్టీతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు చేయడం, చర్చించడం ఈ మహానాడు లక్ష్యం. ప్రతి సంవత్సరం ఏదో ఒక నగరంలో నిర్వహించి.. లక్షలాదిమంది టిడిపి శ్రేణులను తరలించి.. వారికి సంతృప్తికరమైన భోజనాలు పెట్టి పంపించడం ఒక ఆనవాయితీ. అయితే వృధా ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని సూచనలను గౌరవించి.. ఈ ఏడాది మహానాడును రద్దు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ హైబ్రిడ్ మహానాడు నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆసక్తి కనిపిస్తోంది.
* తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా…
తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా.. అంటూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా మహానాడు నిర్వహించి పార్టీ కార్యక్రమాలపై చర్చించి.. రాష్ట్ర అభివృద్ధికి తీర్మానాలు చేసి చర్చించాలన్నది ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం. అప్పటివరకు జాతీయ కాంగ్రెస్ విధానాలతో ఇటువంటి వాసనలు ఉండేవి కావు. ఆ మహా పురుషుడు ఎన్టీఆర్ ఏనాడు అయితే మహానాడు పెట్టారో.. ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తెలంగాణలో మహానాడు నిర్వహిస్తే మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా టిడిపి శ్రేణులు తరలి వెళ్లేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా.. నవ్యాంధ్రప్రదేశ్లో అయినా.. పార్టీ అధికారంలో ఉన్న.. లేకపోయినా మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి పరమ పవిత్రమైన ఒక పండుగ.
* అందరి చూపు అటువైపే..
మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ అభిమాని పులకించుకుపోతారు. అటువంటి మహానాడు ను ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో భౌతికంగా మహానాడు నిర్వహిస్తారు. దానికి అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి.. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడు ను అనుసంధానిస్తారు. ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో మాట్లాడిస్తారు. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ తో వారిని మాట్లాడించడం ద్వారా.. ఒక రకమైన సంతృప్తి ఉండేలా చేస్తారు. మహానాడు హైబ్రిడ్ విధానం ద్వారా చేపట్టడం ద్వారా ఆదా అయిన సొమ్మును పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. గతం మాదిరిగా వేలాదిమందికి మాత్రమే కాదు.. లక్షలాదిమందికి ఈసారి మహానాడు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు పై టిడిపి కంటే ఇతర రాజకీయ పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి ఉంది.
