Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి కీలకమైన ఒక నిర్ణయం సంచలనంగా మారనుంది. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరోక్ష ఎన్నికల పేరుతో జరుగుతున్న బేరసారాల తతంగం, క్యాంపు రాజకీయాలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ఇప్పటివరకు పరోక్ష విధానంలో..
ఇప్పటివరకు పరోక్ష ఎన్నికల విధానంలో స్థానిక సంగ్రామం జరిగేది. ఈ క్రమంలో అధికార బలం, ఆర్థిక ప్రాబల్యం, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం వంటివి ఎక్కువగా జరిగేవి. మెజారిటీ రాని అధికార పార్టీలు ప్రతిపక్షాల నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేసేవారు. క్యాంపు రాజకీయాలు ఎక్కువగా నడిచేవి. అధికారాన్ని హస్తగతం చేసేందుకు ఎన్నో రకాల వత్తులు ఎదురయ్యేవి. ప్రజల తీర్పు ఒకటైతే.. అధికార పీఠంపై కూర్చునేది మరొకరు అయ్యేవారు. ఈ అక్రమ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల చేతికి నేరుగా ఓటు హక్కు ఇవ్వడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు.
* సాహస నిర్ణయం..
ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సాహసించదు. ఎందుకంటే పరోక్ష విధానం ఉంటే వార్డుల్లో సీట్లు తగ్గినా.. సర్పంచ్ లేదా కౌన్సిలర్లను లొంగదీసుకుని మున్సిపాలిటీలు, జడ్పీ లను కైవసం చేసుకునే వెసుల బాటు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. అయితే అక్రమ మార్గాల్లో పీఠాలను దక్కించుకునే సంస్కృతి కంటే.. పారదర్శకమైన ప్రజా తీర్పుకే ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఒక వ్యూహంతో ఉన్నారు. పరోక్ష ఎన్నికల్లో జరిగే కోట్లాది రూపాయల బేరసారాలకు స్వస్తి పలికితే స్థానిక సంస్థల ఎన్నికల్లో జవాబుదారీ పెరుగుతుందనేది ఒక నమ్మకం.
* ఎన్టీఆర్ హయాంలో..
గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేవారు. 1987లో టిడిపి ప్రభుత్వ హయాంలో తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ లను నేరుగా ప్రజలే ఓటు వేసి ఎన్నుకునే వారు. కానీ 2000 దశకంలో చంద్రబాబు హయాంలో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ లను నేరుగా ఎన్నుకునే పద్ధతి నడిచింది. కానీ తర్వాత పాత పద్ధతిని ప్రభుత్వాలు పునరుద్ధరించాయి. చట్టపరమైన కోణంలో చూస్తే భారత రాజ్యాంగంలోని 243 సి పంచాయితీలు, 243 ఆర్ మున్సిపాలిటీలు నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షులు ఎన్నికల విధానాన్ని నిర్ణయించే సర్వాధికారాలు రాష్ట్ర శాసనసభకు ఉన్నాయి. దీనికోసం ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1994, ఏపీ మున్సిపాలిటీ చట్టం 1965, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994 లకు అసెంబ్లీలో సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే కూటమికి అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ ఉండడంతో ఈ చట్ట సవరణలు చేయడం సునాయాసమైన ప్రక్రియ. కచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నిక రావడం ఖాయం.



