Janasena: ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనకు బిగ్ రిలీఫ్. ఆ పార్టీ గుర్తు విషయంలో జరుగుతున్న వివాదానికి ఈరోజు కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. జనసేనకే గాజు గ్లాస్ గుర్తును ఖరారు చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ జాబితాలో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే జనసేన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఈసీ తిరిగి గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే జనసేన కంటే ముందుగా తాము దరఖాస్తు చేసుకున్నామని.. తమకు కాకుండా జనసేనకు కేటాయించడం ఏమిటని.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గాజు గ్లాసు గుర్తు జనసేనదేనని తేల్చి చెప్పింది.రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటీషన్ ను రద్దు చేసింది.
ఆది నుంచి జనసేన గాజు గ్లాస్ గుర్తుపై వివాదం నడుస్తూనే ఉంది. 2014లో జనసేన ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అటు తరువాత ఎలక్షన్ కమిషన్ నుంచి జనసేన గాజు గ్లాస్ గుర్తును పొందింది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేసింది. కానీ ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితం అయ్యింది. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జనసేనకు ఓట్లు రాకపోవడంతో.. ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. అయితే జనసేన ప్రత్యేక విన్నపం మేరకు ఎలక్షన్ కమిషన్ తిరిగి గాజు గ్లాస్ గుర్తును జనసేనకు కేటాయించింది. అయితే జనసేన కంటే ముందుగా తామే దరఖాస్తు చేసుకున్నామని.. కానీ తమకు కాకుండా జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణను ప్రారంభించింది. అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ కంటే ముందుగానే జనసేన దరఖాస్తు చేసుకుందని ఈసీ చెప్పడం, అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంతో కోర్టు.. ఈ పిటీషన్ ను రద్దు చేసింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో నాలుగు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జనసేన అభ్యర్థులు 21 చోట్ల పోటీ చేయనున్నారు. మరో రెండు పార్లమెంట్ స్థానాల్లో సైతం జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కోర్టు తీర్పు జనసేనకు అనుకూలంగా రావడం విశేషం. అయితే గత ఎన్నికల నుంచి గాజు గ్లాస్ గుర్తు అనేక రకాల వివాదాలను ఎదుర్కొంటోంది. అచ్చం గాజు గ్లాస్ గుర్తుకు దగ్గరగా ఉండే బకెట్, ఇతరత్రా గుర్తులతో చిన్నాచితకా పార్టీలు పోటీ చేస్తున్నాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన ఎనిమిది చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా జనసేన గుర్తుకు దగ్గరగా ఉండే.. గుర్తులతో కొంతమంది పోటీ చేశారు. జనసేన పార్టీకి దారుణంగా దెబ్బతీశారు. అయితే ఏపీలో ఏకంగా జనసేన గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలని కోరడం సంచలనం రేపింది. అయితే ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ ను తమకే కేటాయించాలని.. జనసేన ముందుగా అభ్యర్థించడం కలిసి వచ్చింది. లేకుంటే జనసేన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉండేది. మొత్తానికైతే కుట్రలు ఛేదించి రిలీఫ్ పొందడంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది.