Ex Minister Dharmana Prasada Rao : రాజకీయ సన్యాసమా? టిడిపిలోకా? ధర్మాన పయనమెటు?

ఏపీలో సీనియర్ మోస్ట్ లీడర్లలో ధర్మాన ప్రసాదరావు ఒకరు. యువజన కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అమాత్య పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు.

Written By: Dharma, Updated On : September 3, 2024 1:19 pm

Dharmana Prasada Rao

Follow us on

Ex Minister Dharmana Prasada Rao : మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీకి దూరమేనా? ఆయన పార్టీలో కొనసాగరా? రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారా? లేకుంటే మరో పార్టీలో చేరాలనుకుంటున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ ఓటమి నుంచి ఆయన బయటకు కనిపించడం లేదు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కనీసం ఓటమి పై సమీక్షించలేదు. ఒక్క ప్రకటన చేయడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. నిన్నటికి నిన్న శ్రీకాకుళంలో జరిగిన వైయస్సార్ వర్ధంతి కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. స్థానికంగా ఉన్నా అటువైపుగా చూడడం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కుమారుడి కోసం టిడిపిలో చేరతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని.. కానీ అక్కడ ఏమంత కంఫర్ట్ గా లేరన్నది గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న మాట. అందుకే ఇప్పుడు పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారని.. పార్టీ నుంచి బయటకు వస్తారని ప్రారంభమైంది.

* రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు
ధర్మాన ప్రసాదరావు వైయస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలీకుడు. 2003లో పాదయాత్ర చేసిన సమయంలో ధర్మాన ప్రసాదరావు రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఆ ఎన్నికల్లో నరసన్నపేట ను వదిలి శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలిచారు ప్రసాదరావు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు రాజశేఖర్ రెడ్డి. ఆయన బతుకు ఉన్నంతవరకు ఒక వెలుగు వెలిగారు. కానీ జగన్ పుణ్యమా అని ధర్మాన ప్రసాదరావు చరిత్ర మసకబారుతూ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన జగన్ వెంట నడవాల్సి వచ్చింది.

* జగన్ వైఖరిని తప్పు పట్టిన నేత
కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్. సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు. దానిని తీవ్రంగా తప్పు పట్టారు ధర్మాన ప్రసాదరావు. అప్పటికే ఆయన మంత్రిగా ఉన్నారు. జగన్ ను టార్గెట్ కూడా చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ ఏపీలో దారుణంగా నష్టపోయింది. అదే సమయంలో వైసీపీ ఆవిర్భవించింది. అప్పటివరకు జగన్ ను తిట్టిన ధర్మాన అదే పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. అది రాజకీయంగా కూడా మైనస్ గా మారింది. 2014 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి తప్పలేదు. పోనీ జగన్ విడిచిపెడతామని భావించినా ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2019 ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని భావించి వైసీపీలో కొనసాగారు ధర్మాన ప్రసాదరావు.

* ఆది నుంచి అసంతృప్తిగానే
2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో గెలిచారు ధర్మాన ప్రసాదరావు. కానీ ఆయనకు కాకుండా సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్. ఈ నిర్ణయం ధర్మానకు మనస్థాపానికి గురిచేసింది. ఏ మంత్రి పదవి కోసం ఎన్ని రోజులు జగన్ వెంట ఉన్నానో.. అదే పదవి దక్కకపోయేసరికి ధర్మానలో ఒక రకమైన అసంతృప్తి కనిపించింది. దీంతో పరిస్థితి చేయి దాటుతుందని భావించిన జగన్ విస్తరణలో ధర్మానకు ఛాన్స్ ఇచ్చారు. కానీ మునుపటిలా స్వేచ్ఛ లేదు. దీంతో అసంతృప్తితోనే మంత్రి పదవిని అనుభవించారు. ఈ ఎన్నికల్లో ఒక సాధారణ సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. ఇష్టం లేని వైసీపీలో ఉండలేక.. ప్రత్యామ్నాయం లేక రాజకీయ సన్యాసం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిలో చేరతారన్న ప్రచారం అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.