CM Chandrababu: దక్షిణాది రాష్ట్రాల నుంచి చంద్రబాబు ఒక్కరే.. అరుదైన గుర్తింపు

ఇండియన్ మోస్ట్ సీనియర్ లీడర్ చంద్రబాబు.ప్రధాని మోదీ కంటే ముందుగానే ఏపీకి సీఎం అయ్యారు.సుదీర్ఘకాలం ఏపీకి సీఎంగా మంచి గుర్తింపు సాధించారు. కానీ గత ఐదేళ్ల కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సరైన గౌరవం దక్కించుకుంటున్నారు.

Written By: Dharma, Updated On : October 16, 2024 2:42 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి.సార్వత్రిక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ.అయితే ఈ ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి రావాలని భావించింది బిజెపి.కానీ మెజారిటీ మార్కుకు 40 సీట్ల దూరంలో ఉండిపోయింది.అప్పుడే చంద్రబాబు కీలకంగా మారారు.ఆయనతో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏకు మద్దతు తెలపడంతో.. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.అప్పటినుంచి చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది.చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా కేంద్ర పెద్దలతో వ్యవహరిస్తున్నారు.సఖ్యతగా మెలుగుతున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర పెద్దలు ఏపీని సైతం బిజెపి పాలకపక్షంగా భావిస్తున్నారు.తాజాగా అదే భావనతో చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు.ఇటీవల జమ్మూ కాశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులు సైతం ప్రమాణం చేశారు.హర్యానాలో రేపు కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. సీఎంగా నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది.

* హర్యానాలో బిజెపి హ్యాట్రిక్
హర్యానాలో బిజెపికి చావు దెబ్బ తప్పదు అని విశ్లేషణలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం అదే అంచనాలను వేశాయి. అయితే వాటికి చెబుతూ ఫలితాలు తారుమారు అయ్యాయి. హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ కొట్టింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. హర్యానాలో చేదు ఫలితాలు రావడం ఖాయం అన్న సంకేతాలు వచ్చాయి. కానీ అక్కడ బిజెపి తన స్థానాన్ని పదిల పరుచుకుంది. 90 నియోజకవర్గాలకు గాను 48 స్థానాలతో అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది బిజెపి. కాంగ్రెస్ మాత్రం 35 స్థానాలకు పరిమితం అయింది.

* ప్రధానితో పాటు చంద్రబాబు హాజరు
హర్యానా ఫలితం బిజెపికి కొత్త ఊపిరిలు ఊదింది.దేశంలో బిజెపి హవా తగ్గలేదని నిరూపించింది.అందుకే హర్యానా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సంబరాలు చేసుకోవాలని బిజెపి భావించింది.ప్రమాణ స్వీకార వేడుకలకు బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,రాజస్థాన్,చత్తీస్గడ్రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్,మోహన్ యాదవ్,భజన్ లాల్ శర్మ, విష్ణు దేవ్ సాయ్ హాజరుకానున్నారు. ఇక కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, మనోహర్లాల్ కట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మల సీతారామన్ తదితరులు హాజరుకానున్నారు. మరోవైపు ఎన్డిఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, నితీష్ కుమార్ లకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందుకున్నఏకైక సీఎం చంద్రబాబు కావడం విశేషం.ప్రధాని మోదీ హాజరుకానున్న దృష్ట్యా ఏపీ సీఎం చంద్రబాబు సైతం పాల్గొనవచ్చు అని తెలుస్తోంది.