YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి డాక్టర్ అప్పలరాజు అలానే బుక్ అయ్యారు. తన కుమారుడి మూలంగా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా.. దానికి చట్టపరంగా ముందుకు వెళ్లి ఉంటే ఏ సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ దానిని తారుమారు చేసి తన మీదకు కష్టం తెచ్చుకున్నారు. బాధ్యతాయుతమైన వ్యక్తి కూడా బాధ్యత మరిచి వ్యవహరించారు. అరెస్టుకు గురయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో జోగి రమేష్ చేరారు. తన కుటుంబంలో వివాదాన్ని పరిష్కరించుకోలేకపోయారు. చివరకు ఆయన కోడలు ఏకంగా మాజీ మంత్రితోపాటు కుటుంబ సభ్యులు 11 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం గృహహింసకు గురి చేస్తున్నారు అంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ మాజీ మంత్రి కుటుంబం చిక్కుల్లో పడింది.
* అలా బుక్కైన అప్పలరాజు..
సమాజంలో రోడ్డు ప్రమాదాలు, కుటుంబ వివాదాలు అనేవి సర్వసాధారణం. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరిని ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మాజీ మంత్రి అప్పలరాజు రంగంలోకి దిగారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లి.. కుమారుడిపై పోలీస్ కేసుకు ఒప్పుకొని ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే కుమారుడిని తప్పించి మరొకరిని బలి పశువు చేయాలన్న ఆలోచన వచ్చిందో.. అప్పుడే ఒక బాధ్యతాయుతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. పోలీస్ కేసులకు గురయ్యారు. అరెస్ట్ కూడా జరిగింది. దానిని రాజకీయ కక్ష సాధింపు చర్యల కింద చూపడం అనేది తగదు కూడా. ఎందుకంటే సహజంగానే రాష్ట్రంలో ఏ అంశం జరిగిన అది రాజకీయమే అవుతుంది. అది తెలిసి కూడా అప్పలరాజు తప్పు చేసినట్టు అయింది. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అయింది.
* పెద్దరికం చూపించని జోగి…
ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి కూడా అదే. కుటుంబం పూర్తిగా సంక్షోభంలో కూరికిపోయింది. ఏడాది కిందట అంగరంగ వైభవంగా.. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి తన కుమారుడు రాజీవ్ ను వివాహం చేశారు. కానీ తన కుమారుడు, కోడల మధ్య విభేదాలను పరిష్కరించే పెద్దరికం పాత్ర పోషించలేకపోయారు. సొంత కోడలితో రాజీ కుదుర్చుకోవాల్సింది పోయి.. ఆమెను లేనిపోని ఇబ్బందులకు గురి చేయడం వల్లే పరిస్థితి పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. వరకట్న వేధింపులు, గృహహింస ఆరోపణలతో కోడలు నేరుగా పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కడంతో పరువు బజారున పడింది. ఒకవైపు ఆర్థిక నేరాలు, మరోవైపు కుటుంబ వివాదాలు జోగి రమేష్ మెడకు ఉచ్చుల బిగుసుకుంటున్నాయి. చట్టం పని తాను చేసుకు పోతుంటే దీనిని కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిస్తోంది. చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడం, తీరా చర్యలకు దిగితే అధికార కూటమి ప్రభుత్వం తమను రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని ఆరోపించడం పరిపాటిగా మారింది. యధా రాజా తథా ప్రజా అన్నట్టు ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వారి కుటుంబ వ్యవహారాలను, వివాదాలను రాజకీయ కక్షతో ముడిపెట్టడం ఏపీలో వైసీపీకి ఒక అలవాటైన విద్యగా మారిపోయింది.






