Pawan Kalyan : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. పాలనను ప్రారంభించారు. మంత్రులు సైతం మంచి ముహూర్తం చూసుకొని బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో తన నివాసంతో పాటు కార్యాలయాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఆయనకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ కు గౌరవం తగ్గకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తన తరువాత పవనే అన్నట్టు ఉండేలా చూసుకున్నారు. పవన్ నచ్చిన శాఖలను కేటాయించారు.
ప్రస్తుతం పవన్ విజయవాడలో ఉన్నారు. ఈరోజు సచివాలయంలో తన ఫేషిని పరిశీలించనున్నారు. పవన్ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయించారు. ఇప్పటికేసీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను విధిగా ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మరోవైపు పవన్ భద్రతను పెంచారు. వై ప్లస్ కేటగిరి భద్రతను సమకూర్చారు.ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును పవన్ కలుసుకునే అవకాశం ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సచివాలయానికి రానున్న నేపథ్యంలో అమరావతి రైతులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఈరోజు ఉదయం గన్నవరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అధికారులు, జనసేన అభిమానులు స్వాగతం పలికారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. తెగ వైరల్ అవుతోంది. పవన్ కోసం ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ, ఎస్కార్టును కేటాయించింది. కాన్వాయ్ లో సఫారీ, ఫార్చునర్లు, పవన్ రెగ్యులర్గా ఉపయోగించే ల్యాండ్ క్రూజర్ ఉన్నాయి. విజయవాడ తో పాటు సచివాలయ ప్రాంతంలో ఈ కాన్వాయ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మరికొద్ది సేపట్లో పవన్ అమరావతిలోని సచివాలయానికి వెళ్ళనున్నారు. కొత్త కాన్వాయ్ లో పవన్ ను చూస్తున్న జనసైనికులు ఆనందంతో మురిసిపోతున్నారు.