Peddireddy Ramachandra Reddy: ఆపరేషన్ పెద్దిరెడ్డి స్టార్ట్.. చంద్రబాబు దెబ్బ మామూలుగా లేదుగా

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు పెద్దిరెడ్డి. గత పది సంవత్సరాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా అయితే.. పెద్దిరెడ్డి అంటే రాయలసీమ.. రాయలసీమ అంటే పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి ఉండేది.

Written By: Dharma, Updated On : June 27, 2024 4:51 pm

Peddireddy Ramachandra Reddy

Follow us on

Peddireddy Ramachandra Reddy: జగన్ రాజకీయంగా దెబ్బతీశారు చంద్రబాబు. కూటమి కట్టి దారుణ పరాజయాన్ని చవిచూసేలా చేశారు. ఇంతటితో చంద్రబాబు దాహం తీరలేదు. ముందుగా జగన్ ఆయువుపట్టులపై దృష్టి సారించారు. ముల్లును ముల్లుతోనే తీయాలి
.. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు.. జగన్ ని టచ్ చేయకుండానే.. ఆయన బలాలపై దృష్టి పెట్టారు చంద్రబాబు. వైసీపీలో నెంబర్ 2 గా భావిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సినిమా చూపిస్తున్నారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచారు పెద్దిరెడ్డి. గత పది సంవత్సరాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా అయితే.. పెద్దిరెడ్డి అంటే రాయలసీమ.. రాయలసీమ అంటే పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి ఉండేది. చివరకు మాజీ సీఎం హోదాలో చంద్రబాబు కుప్పంలో పర్యటించాలన్నా పెద్దిరెడ్డి దయాదాక్షణ్యాలపై ఆధారపడే అంతటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు విపక్షనేతగా పుంగనూరులో అడుగుపెడతానంటేనే చుక్కలు చూపించారు పెద్దిరెడ్డి. అంగళ్లలో అరాచకమే సృష్టించారు. అంతటితో ఆగకుండా వందలాది మంది టిడిపి నేతలను అరెస్టు చేయించారు. రోజుల తరబడి జైల్లో మగ్గేలా చూశారు. చివరకు అవినీతి కేసులకు తోడు అంగళ్ళ కేసును చంద్రబాబు మెడకు చుట్టారు. ఇవన్నీ చంద్రబాబు మైండ్ లో ఉన్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ పెద్దిరెడ్డిని ప్రారంభించారు.

చంద్రబాబు పేరుకే కుప్పం పర్యటన. సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. రెండు రోజులపాటు అక్కడే గడిపారు. కానీ సింహభాగం పుంగనూరు నియోజకవర్గానికి కేటాయించారు. పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు తో పాటు టిడిపి నేతలు కుప్పం వచ్చారు. వారికి పలు సూచనలు చేశారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఇలా కుప్పం నుంచి బయటకు అడుగు పెట్టారో లేదో.. పుంగనూరులో ప్రకంపనలు మొదలయ్యాయి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా తో పాటు 12 మంది కౌన్సిలర్లు సైకిల్ ఎక్కారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిణామాలతో పెద్దిరెడ్డిలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బిజెపితో మంతనాలు ప్రారంభించారు. అయినా సరే పెద్దిరెడ్డి కుటుంబం విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు పుంగనూరు గడ్డ నాది అంటూ సవాల్ చేసిన పెద్దిరెడ్డిని.. శాశ్వతంగా ఆ నియోజకవర్గానికి దూరం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పెద్దిరెడ్డి తో తనకు ఎదురైన అవమానాలకు బదులిచ్చేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నాలు ప్రారంభించారు.