CM Chandrababu: వైసిపి మత్తులో పోలీస్ అధికారులు.. చంద్రబాబు వార్నింగ్

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లారు. అక్కడ రెండు రోజులపాటు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

Written By: Dharma, Updated On : June 27, 2024 9:55 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: గత ఐదు సంవత్సరాలుగా ఏపీలో రాజకీయ ప్రేరేపిత కేసులు కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విపక్షాలను ఉక్కుపాదంతో అణచిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది టిడిపి నేతలపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. ప్రశ్నిస్తే కేసు, దాడిని ప్రతిఘటిస్తే కేసు.. ఇలా ఒకటేమిటి చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఒక దళిత మహిళగా ఉన్న తాజా హోం మంత్రి వంగలపూడి అనిత పై ఏకంగా అట్రాసిటీ కేసు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి జిల్లాలో టిడిపి కీలక నేతలపై కేసులు నమోదు చేసి ఉక్కిరి బిక్కిరి చేశారు. టిడిపి శ్రేణుల గురించి చెప్పనవసరం లేదు. లెక్కకు మించి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటువంటి రాజకీయ ప్రేరేపిత కేసుల విషయంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అటువంటి కేసులను ఎత్తివేయాలని.. టిడిపి శ్రేణులపై నమోదు చేసిన రౌడీషీట్లను తొలగించాలని సీఎం చంద్రబాబు పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిజమైన రౌడీ షీటర్లు, సంఘవిద్రోహశక్తుల విషయంలో మాత్రం అలెర్ట్ గా ఉండాలని కూడా ఆదేశించారు. ఇంకా కొంతమంది అధికారులు వైసిపి మత్తులో ఉన్నారని చంద్రబాబు చురకలు అంటించారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లారు. అక్కడ రెండు రోజులపాటు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 2019కి ముందు తన మీద ఎలాంటి కేసులు లేవని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 కేసులను నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ సీఎం హోదాలో ఉన్న తనపై రెండు హత్యయత్నం కేసులు పెట్టడాన్ని ప్రస్తావించారు. తన పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్య టీడీపీ శ్రేణుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు.

రాజకీయ ప్రేరేపిత కేసుల్లో భాగంగా టిడిపి శ్రేణులపై పెట్టిన రౌడీషీట్లు తక్షణం ఎత్తివేయాలని పోలీస్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇకముందు రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టకూడదని కూడా సూచించారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు తల ఊపుతూ అమాయకుల మీద కేసులు పెట్టకూడదని.. అలా చేస్తే వైసిపి పాలనకు, తమ పాలనకు తేడా ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలు వైసిపి నాయకుల ప్రోద్బలంతో కొంతమంది అధికారులు మనసు చంపుకుని పని చేశారని.. ఇకముందు ధైర్యంతో మీ పనులు చేసుకోవాలని.. రాజకీయ జోక్యం కూడా ఉండదని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.