Bode Ramachandra Yadav BCV Party: రాజకీయ పార్టీలు( political parties) అంటే ప్రజా సమస్యలపై మాట్లాడాలి. ప్రజల కోసమే పని చేస్తున్నట్టు ఉండాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎంతవరకు గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వైఫల్యాలపై ప్రభుత్వంతో పోరాడేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమయం కేటాయిస్తోంది. ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం నుంచి టీటీడీ లడ్డు కల్తీ దాకా గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలపైనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. కానీ ప్రజలు పలానా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించండి అని ఆందోళన చేయలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ లోటు తీర్చుతున్నారు బోడె రామచంద్ర యాదవ్. భారతీయ చైతన్య యువజన పార్టీ తరుపున ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే ఏపీ ప్రజలకు ప్రతిపక్ష పార్టీగా అనిపిస్తోంది కూడా..
Also Read: అభిషేక్ పోస్ట్… చెప్పుతో యూవీ రిప్లై!
* బీసీల గొంతుకగా..
బీసీల కోసం ఒక పార్టీ కావాలని భావించారు బోడె రామచంద్ర యాదవ్( bode Ramachandra Yadav ). అంతకుముందు ఆయన జనసేనలో పనిచేశారు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీపై పోరాటం చేశారు. కానీ బడుగు బలహీన వర్గాల వారికి ఒక రాజకీయ పార్టీ ఉండాలని భావించారు రామచంద్ర యాదవ్. అలా పుట్టుకొచ్చింది బీసీవై పార్టీ. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ పై పలుమార్లు దాడులు కూడా జరిగాయి. అయినా ఆయన భయపడలేదు. ఆయన చంద్రబాబు మనిషి అని ముద్ర వేశారు. కానీ అటువంటిదేమీ లేదని నిరూపించారు రామచంద్ర యాదవ్. మొన్నటి ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేసింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం ఓట్లు రాలేదు. అయినా సరే ప్రజా సమస్యలపై రామచంద్ర యాదవ్ పోరాడుతున్న తీరును మాత్రం ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
* ఇన్ని పార్టీలు ఉండగా..
రాష్ట్రంలో కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మరో ప్రధాన పార్టీగా ఉంది. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కొనసాగుతోంది. చిన్న చిన్న పార్టీలు సైతం ఉన్నాయి. కూటమిలో మూడు పార్టీలు ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రధాన పార్టీ గా కొనసాగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పైగా 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ. ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న ఆ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయడంలో మాత్రం వెనుకబడిపోయిందన్న విమర్శ ఉంది. అయితే ఆ లోటును భర్తీ చేస్తున్నారు బోడె రామచంద్ర యాదవ్. బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లతో పాటు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని ఆయన కోరుతూ వస్తున్నారు. పైగా సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తున్నారు. ఆయన ప్రసంగాల తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇలానే ఆయన ముందుకు సాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోషించలేని పాత్రలోకి వెళ్లడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ఎలాగూ బలంగా ఉంది. బలపడాలనుకుంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. కానీ ఇటువంటి సమయంలో బోడె రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తోంది.
* కేంద్ర పెద్దలతో సంబంధాలు..
బోడే రామచంద్ర యాదవ్ ను అంత తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. కేంద్ర పెద్దలతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర బిజెపితో సఖ్యత అందరికీ తెలియాల్సిందే. ఆ సమయంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు పలుమార్లు రామచంద్ర యాదవ్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆ క్రమంలో రామచంద్ర యాదవ్ నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అటు తరువాత ఆయనకు కేంద్రం నుంచి భారీ భద్రత లభించింది. అంతలా కేంద్ర పెద్దలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం. అందుకే రామచంద్ర యాదవ్ వెనుక బిజెపి పెద్దల వ్యూహం కూడా ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ప్రజల్లో రామచంద్ర యాదవ్ వాయిస్ మరింత పెరిగితే బిజెపి పెద్దలు సైతం ఆయనను దగ్గర తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..