AP BJP: బిజెపి ఎంపీ సీఎం రమేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీ బీజేపీలో భారీ చేరికలు ఉంటాయని ప్రకటించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు.. తరువాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కూటమి పార్టీలో అవకాశం దక్కని వారు మాత్రమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జనసేన సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికలకు గాను ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బిజెపి సైతం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా సీఎం రమేష్ ఈ ప్రకటన చేయడంతో ప్రకంపనలు రేగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ గా లేని నాయకులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని బిజెపి ఆకర్షించే ప్రయత్నంలో ఉందని ప్రచారంలో ఉంది.
* బెంగాల్ వ్యవహారాల్లో..
బెంగాల్ రాజకీయాల గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు అక్కడ 59 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కి గుడ్ బై చెప్పారు. మరో 20 మంది ఎంపీలు వేరు శిబిరం పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం అయి ఎన్ డి ఏ లో చేరిపోయారు. ఈ చేరికల వెనుక సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారు. జాతీయస్థాయిలో సైతం సీఎం రమేష్ పాత్ర పెరిగింది బెంగాల్ వ్యవహారాలతో. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏపీలో దెబ్బతీసే బాధ్యతను బిజెపి పెద్దలు సీఎం రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
* ఆ సీనియర్లంతా గుడ్ బై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పేరు మోసిన నేతలు చాలామంది ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక భావజాలం ఉన్నవారే. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీతో పోరాటం చేసిన వారే. వారు టిడిపిలో చేరుతామంటే కుదరదు. అందుకే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే చాలామంది వైసిపి సీనియర్లు బిజెపిలోకి వస్తామంటే టిడిపి అభ్యంతరం తెలిపింది. మళ్లీ ఎన్నికల ముంగిట వారంతా వైసీపీలోకి యూటర్న్ తీసుకుంటారని.. బిజెపిని వైసిపి దగ్గరకు చేరుస్తారన్న అనుమానాలతోనే అప్పట్లో అలా వ్యవహరించింది. అయితే ఇప్పుడు వైసీపీని దెబ్బతీసే ప్రణాళిక తో కూటమి ముందుకు వెళ్తోంది. జనసేనతో పాటు బిజెపిలో చేరికలకు టిడిపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు బిజెపి తరఫున సీఎం రమేష్ రంగంలోకి దిగారు. సీనియర్ మోస్ట్ వైసిపి నేతలను బిజెపిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం.

