Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే ప్రయత్నాలు అని అర్థం అవుతోంది. కుమారుడు చేసిన బైక్ యాక్సిడెంట్ తో మాజీ మంత్రి అప్పలరాజు.. నకిలీ ధ్రుపత్రాలతో కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినందుకుగాను తమ్మినేని సీతారాం పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అప్పలరాజు అరెస్టయ్యారు. తమ్మినేని పరారీ లో ఉన్నారు. అయితే ఇంతలోనే మాజీ మంత్రి పేర్ని నానికి కూడా తన కుమారుడు కోసం చేసిన ఒక వ్యవహారం మెడకు చుట్టుకునేలా ఉంది.
* గెలుపు కోసం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మొన్నటి ఎన్నికల్లో గెలిచేందుకు చిత్రవిచిత్రాలకు పాల్పడ్డారు. 2024 ఎన్నికల సమయంలో అప్పటి వైసిపి ప్రభుత్వం పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఈ తరుణంలో ఎలాగైనా గెలిచేందుకు ఆ పార్టీలో ముఖ్య నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. ప్రజలను ఎలాగైనా మభ్య పెట్టేందుకు మరోసారి వారి ప్రయత్నాలు అప్పట్లో సాగాయి. కానీ ప్రజలు అంగీకారం తెలపలేదు. అయితే ఇప్పుడు వారు చేసిన విన్యాసాలు బయటకు వెళ్లడవుతున్నాయి. న్యాయస్థానాలు తప్పు పడుతున్నాయి. తాజాగా మాజీమంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు మచిలీపట్నం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించడం విశేషం.
* ఫోర్జరీ సంతకాలతో పట్టాలు..
మచిలీపట్నం నుంచి 2019లో గెలిచారు పేర్ని నాని. ఆయనను క్యాబినెట్ లోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రెండున్నర ఏళ్ళు మంత్రిగా కూడా కొనసాగారు. అయితే 2024 ఎన్నికల్లో తన వారసుడు కిట్టును రంగంలోకి దించారు. అయితే కుమారుడ్ని ఎలాగైనా గెలిపించుకునేందుకు నాని పేదలకు ఇళ్ల పట్టాలు అంటూ హడావిడి చేశారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ ముందు భారీ ఎత్తున నకిలీ ఇళ్ల పట్టాలు అందించారు. ఎన్టీఆర్ నగర్, హోసన్న మందిరం సమీపంలోని మూడు గుల్ల వెనుక రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నెంబర్లు వేసి పట్టాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. తహసిల్దార్ ఫోర్జరీ సంతకాలు, పొంతన లేని పేర్లు, హద్దులతో పట్టాలు ఇచ్చేశారు.
* అప్పట్లో ఆందోళన..
2024 మార్చి రెండో వారంలో తహసిల్దార్ కార్యాలయంలో నకిలీ పట్టాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు కూటమి నేతలు అర్ధరాత్రి వరకు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.. అప్పట్లో ఆర్డీవో గా ఉన్న గీతాంజలి శర్మ కార్యాలయానికి వచ్చి ఆ పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ అప్పట్లో అధికార ఒత్తిడితో ఆ పట్టాలని వాస్తవమైనవి అని సమాచార శాఖ ద్వారా ప్రకటన రావడం గమనార్హం. మరోవైపు ఏప్రిల్ నెలలో అప్పటి తాసిల్దార్ సునీల్ బాబు ఆ పట్టాలపై తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విఆర్వోను సస్పెండ్ చేయడం.. ఇద్దరు ముగ్గురుకి షోకాజ్ నోటీసులు జారీ చేసి వదిలేశారు.
* కోర్టు కీలక ఆదేశాలు..
అయితే ఈ నకిలీ పట్టాలపై న్యాయపోరాటం చేస్తున్నారు టిడిపి నేత దిలీప్ కుమార్. కానీ అధికార యంత్రాంగం ఉదాసీన వైఖరి పై నిరసిస్తూ గత ఏడాది జూలైలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం వాస్తవాలను నిర్ధారించుకొని నాలుగు వారాల్లోపు నకిలీ పట్టాలను రద్దుచేసి.. తీసుకున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించడం అధికార యంత్రాంగానికి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అయితే తమను తండ్రి కొడుకులు దారుణంగా వంచించారు అంటూ పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



