AP MLC Elections: ఏపీలో( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. అయితే ఆ నాలుగులో ఒకటి బిజెపికి ఇస్తారా? నాలుగు మొత్తం టిడిపి పోటీ చేస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని తెలుస్తోంది. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టిడిపికి దక్కే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు భారీగా ఉన్నారు. నాలుగు పదవుల కోసం దాదాపు 25 మంది పోటీ పడుతున్నారు.
Also Read: కేసుల పేరుతో పోసానిని ఏపీ మొత్తం తిప్పుతున్నారే!
* మారుతున్న పరిణామాలు
రోజురోజుకు పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రోజుకో ఒక్క పేరు తెరపైకి వస్తోంది. ప్రధానంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు( devineni Uma maheshwarao) పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. అదే సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు నేతలు సైతం తెరపైకి వచ్చారు. ఇంకోవైపు విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ ల పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. ఇంకోవైపు కొమ్మలపాటి శ్రీధర్ పేరు కూడా వినబడుతోంది. దీంతో ఆశావహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
* పిఠాపురం వర్మకు ఖరారు
పిఠాపురం వర్మ ( Pithapuram Varma )పేరు ఖరారు అయినట్లు ఆ మధ్యన ప్రచారం నడిచింది. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే 9 నెలలు అవుతున్నా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. ఇటీవల ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అందుకే అసంతృప్తి మాటలతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశారు. దీంతో తెలుగుదేశం నాయకత్వం వర్మ విషయంలో సీరియస్ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నం
వసంత కృష్ణ ప్రసాద్ ( Vasant Krishna Prasad ) కోసం తన టిక్కెట్ వదులుకున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు. మైలవరం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి చివరి నిమిషంలో టిడిపిలో చేరారు వసంత కృష్ణ ప్రసాద్. అప్పటివరకు ఉమామహేశ్వరరావు ఆయనకు ప్రత్యర్థిగా ఉండేవారు. కానీ చంద్రబాబు కోరేసరికి టికెట్ వదులుకున్నారు. దీంతో ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి కానీ, రాజ్యసభ పదవి కానీ ఇస్తారని ప్రచారం నడిచింది. తనకు తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం.
* రెడ్డి సామాజిక వర్గం నుంచి..
ఇంకో వైపు రెడ్డి సామాజిక వర్గం నుంచి సైతం ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏరాసు ప్రతాప్ రెడ్డి పేరు ( Pratap Reddy)ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు సైతం తెరపైకి వస్తోంది. అయితే బిజెపి కోటాలో కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉంది. అందుకే ప్రత్యామ్నాయంగా రాయలసీమలో రెడ్డి నేతలకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇంకోవైపు ఎమ్మెల్సీలుగా పదవీ విరమణ చేసిన యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పరుచూరి అశోక్ బాబు తదితరులు తమకు పదవులు కావాలని కోరుతున్నారు ఇలా నాలుగు పదవులకు దాదాపు 25 మంది వరకు పోటీ పడుతుండడం విశేషం.
Also Read: బోరుగడ్డ అనిల్ ను అలా చేయాలని చూస్తోంది ఎవరు? లైవ్ లో ఏడుస్తూ చెప్పినవన్నీ నిజాలేనా?