AP BJP Leaders  : ఏపీ బీజేపీ నేతలకు ఏమైంది? పక్క రాష్ట్రం వారు స్పందిస్తున్నారేంటి?

ఏపీ బీజేపీ నేతల వైఖరి మారడం లేదు. తాము కూటమిలో ఉన్నామన్న కనీస ధ్యాస లేదు. తిరుమలలో వివాదం నేపథ్యంలో ఏపీలో బిజెపి సీనియర్లు మౌనంగా ఉన్నారు. తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ఫైర్ అవుతున్నారు.

Written By: Dharma, Updated On : September 29, 2024 3:30 pm

AP BJP Leaders 

Follow us on

AP BJP Leaders   : తిరుమలలో వ్యవహారంలో ఏపీ బీజేపీ నేతలు పెద్దగా మాట్లాడటం లేదు. పొరుగును ఉన్న తెలంగాణ నేతలు శరవేగంగా స్పందించారు. వైసిపి పై విమర్శలు చేశారు. జగన్ సైతం అదే గుర్తు చేశారు. తనను తిట్టించడానికి తెలంగాణ బిజెపి నేతలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఏపీ బీజేపీ నేతల పాత్ర ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. ఎన్నికల నుంచి బిజెపి సీనియర్లు చాలామంది సైలెంట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పొత్తును ఈ సీనియర్లంతా వ్యతిరేకించారు. దీంతో ఈ ఎన్నికల్లో పొత్తు కుదరడంతో వారందరికీ టిక్కెట్లు దక్కలేదు. ఎవరైతే టిడిపితో పొత్తుకు ఓకే అన్నారో.. అందుకు సహకారం అందించారో.. వారందరికీ టిక్కెట్లు దక్కాయి. పొత్తులో భాగంగా గెలిచారు. అయితే చాలాకాలంగా బిజెపిలో ఉండి టిక్కెట్లు దక్కని వారు సైలెంట్ అయ్యారు. తాజాగా లడ్డు వివాదంలో కూడా వీరెవరు కలుగజేసుకోవడం లేదు. కానీ తెలంగాణ బిజెపి నాయకులు మాత్రం ఈ ఘటనపై స్పందించారు. బండి సంజయ్ వంటి వారు బాహటంగానే తప్పు పట్టారు. తాజాగా తెలంగాణ బిజెపి నేత మాధవి లత సైతం వైసీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాదు నుండి వందే భారత్ రైల్లో భజన చేసుకుంటూ తిరుమలలో అడుగుపెట్టారు. జగన్ పై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. హైదరాబాదులోని మీ ఆసుపత్రిలో భజన చేసుకోండి అంటూ హితవు పలుకుతున్నారు.

* నిత్యం విభేదాలే
వాస్తవానికి ఏపీ బీజేపీలో పెద్దపెద్ద నాయకులు ఉన్నారు. కానీ వారంతా ప్రో టిడిపి, ప్రో వైసిపి అన్న రీతిలో మారిపోయారు. వైసీపీ హయాంలో సౌండ్ చేసే నేతలంతా ఆ పార్టీకి అనుకూలమని అప్పట్లో ప్రచారం సాగింది. అప్పట్లో ఆ నేతలు టిడిపి అంటేనే మండిపడేవారు. టిడిపి తో పొత్తు ప్రసక్తి లేదని తేల్చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కూటమిఅధికారంలోకి వచ్చింది. ఆ నేతలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పొత్తు ద్వారా గెలిచిన నాయకులు అసలు బిజెపి వారు కాదన్నట్టుంది వైసీపీ వ్యవహార శైలి. లడ్డు వివాదం నేపథ్యంలో పురందేశ్వరి తో పాటు సీనియర్లంతా తప్పు పట్టారు. కానీ జగన్ వారిని పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం.

*స్పందించలేదు ఎందుకు?
లడ్డు వివాదం నేపథ్యంలో జాతీయస్థాయిలో హిందూ ధార్మిక సంఘాలు స్పందించాయి. కానీ హిందుత్వాన్ని భుజంపై వేసుకునే బిజెపి ఏపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో స్పందించలేదు. కనీసం ఖండించలేదు కూడా. ఏపీ బీజేపీలో కొనసాగుతున్న మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణారావు అయితే.. నెయ్యి కల్తీ ని నమ్మలేదు అన్నట్టు మాట్లాడారు.సోము వీర్రాజు,జివిఎల్,విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు అయితే కనీసం స్పందించిన దాఖలాలు లేవు. మొన్నటి ఎన్నికల్లో టికెట్లు లభించలేదు వారికి. కనీసం నామినేటెడ్ పదవుల్లో ఆయన వారి పేరు పరిగణలోకి తీసుకోలేదు. అందుకే లడ్డు వ్యవహారంలో వారు తల దూర్చలేదు.

* త్వరలో కిరణ్ కు పగ్గాలు
ఏపీలో అసలు బిజెపి.. ఫిరాయింపు బిజెపి.. అన్నట్టు నేతలు విభేదించుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపై మండిపడుతున్నారు. ఆమె టిడిపికి అనుకూలంగా ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆపై సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. త్వరలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర బిజెపి వర్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటికైనా బిజెపిలోని వర్గాలు కట్టడిలోకి వస్తాయా? లేదా? అన్నది చూడాలి.