AP Rain Alert: వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజులపాటు వర్ష వాతావరణం ఉంటుందని తేల్చి చెప్పింది. ఏపీతోపాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో ఈ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఏపీకే కాదు తెలంగాణలో సైతం చాలా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
* అల్పపీడన ప్రభావం..
ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వర్షాలు కూడా పడ్డాయి. అయితే తీరం దాటిపోయింది అల్పపీడనం. బలహీనంగా కూడా మారింది. దీంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రధానంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈనెల 11 వరకు ఈ ఈదురుగాలుల తీవ్రత కొనసాగనుంది. బలమైన గాలుల వల్ల చెట్లు, స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలపాటు ఏపీతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ వర్షాలు కొనసాగనున్నాయి.
* ప్రధానంగా తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండనుంది.
* ఏపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యంలో సైతం ఈ వర్షాలు కొనసాగుతాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై.. అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఏపీ విపరీత నిర్వహణ సంస్థ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
