Punganur : మూడు రోజుల కిందట అదృశ్యం.. చివరకు సమ్మర్ స్టోరేజ్ లో డెడ్ బాడీ.. ఏపీలో కలకలం రేపుతోన్న చిన్నారి మృతి మిస్టరీ

పుంగనూరులో ఓ చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.ఇంటిముందు ఆడుకుంటున్న ఆ చిన్నారి మూడు రోజుల కిందట అదృశ్యమైంది.పోలీసులు వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆమె మృతదేహం నీటిలో వెలుగు చూసింది.

Written By: Dharma, Updated On : October 3, 2024 4:08 pm

6 year old girl Aswia

Follow us on

Punganur : పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యం విషాదాంతంగా మారింది.స్నేహితుల ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఆ బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. అసలు ఆ బాలికను ఎందుకు అదృశ్యం చేశారు? ఎందుకు చంపారు? అన్నది తెలియడం లేదు. కానీ ఆ చిన్నారి మృతదేహం అనుమానాస్పద స్థితిలో మాత్రం కనిపించింది. హత్యగా నిర్ధారణ అయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పుంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన అజ్మతుల్లా కూతురు అస్వియా (6) తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇలా ఆడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.కాసేపటికి అస్వియా తల్లి బయటకు వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. స్థానికులతో కలిసి వెతికినా ఆచూకీ కనిపించలేదు. తండ్రి ఆత్మతుల్లా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎస్పీ ఆదేశాలకు 11 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు స్క్వాడ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయినా సరే ఆచూకీ లభించలేదు. అజ్మతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండడంతో.. ఎవరితోనైనా ఆర్థిక విభేదాలు ఉన్నాయోనని ఆరా తీశారు. కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది.

* సమ్మర్ స్టోరేజీలో మృతదేహం
కాగా బుధవారం అస్వియా మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గరచిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం అస్వియా దేనని గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో ఎవరో హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారి హత్యకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

* బయటపడని క్లూ
అయితే ఈ ఘటనకు సంబంధించి చిన్న క్లూ కూడా బయటకు రావడం లేదు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నలుగురు వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.ఎస్పీ మణికంఠ సైతం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవన్నారు. ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.దీంతో ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.