Hungary: పెరుగుతున్న జనాభా ప్రపంచానికి సమస్యగా మారుతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జనాభా పెరుగుదలకు అనేక పథకాలను ప్రవేశపెడుతన్నాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశంగా భారత్ మొదటిస్థానంలో ఉంది. మన తర్వాత స్థానంలో చైనా నిలిచింది. దీంతో ఈ దేశాల్లో జనాభా నియంత్రణకు పథకాలు ప్రవేశపెడుతున్నాయి ప్రభుత్వాలు. అయితే ఐరోపా దేశం హంగేరి ప్రభుత్వం మాత్రం జనాభా పెరుగుదలకు ఆఫర్లు ప్రకటించింది. ఆదేశం జనాభా క్షీణత సమస్య ఎదుర్కొంటోంది. దీంతో వలసలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశ జనాభా పెంచుకునేందుకు వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కువ మంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రధాని స్వయంగా ప్రకటన..
పిల్లలు ఎక్కువగా కనేవారికి ట్యాక్స్ ఉప సంహరిస్తామని ఆదేశ ప్రధాని విక్టోర్ అర్బన్ స్వయంగా ప్రకటించారు. ఐరోపాలో జనాలు చాలా తక్కువగా ఉన్నారని, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారతున్నాయని తెలిపారు. జనాభా పెంచుకునేందుకు వలస దారులను ఆహ్వానించాల్సి వస్తోందని పేర్కొన్నారు. అందుకే తాము విభిన్న ఆలోచనలతో ముందుకు వచ్చామని వెల్లడించారు. కనీసం నలుగురు పిల్లలు లేదా అతకంటే ఎక్కువ మందిని కనే మహిళలకు జీవితకాలం ఆదాయపన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తామని తెలిపారు.
కార్ల కొనుగోలుపై రాయితీ..
మరోవైపు పెద్ద కుటుంబాలు పెద్ద కార్లు కొనుగోలు చేసుకునేందుకు రాయితీ కూడా ఇస్తామని హంగేరీ ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21 వేల క్రెచ్లను ప్రారంభించినట్లు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని హంగేరీ సర్కార్ భావిస్తోంది. గతంలో కూడా అక్కడి ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పెళ్లిళ్లు జనాల రేటు పెంచుకునేందుకు 2019లో 41 ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్ ఫోరింట్స్ సబ్సిడీ రుణాలు కల్పించింది. పెళ్లయిన తర్వాత పిల్లలు పుడితే రుణంలో మూడో వంతు మాఫీ చేస్తామని తెలిపింది. ముగ్గురు పిల్లలు పుడితే రుణం మొత్తం మాఫీ చేస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హంగేరీ జనాభా కేవలం 96.4 లక్షలు మాత్రమే.