Site icon OkTelugu

YV Subbareddy Vs Balineni Srinivas Reddy: బావ వైవి సుబ్బారెడ్డి పై.. బావమరిది బాలినేని కన్నెర్రకు కారణం ఏంటి?

YV Subbareddy Vs Balineni Srinivas Reddy

YV Subbareddy Vs Balineni Srinivas Reddy

YV Subbareddy Vs Balineni Srinivas Reddy: ఒక మనిషి పతనాన్ని ఇంకో మనిషి కోరుకున్నాడు అంటే దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విషయంలో ఆయన సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ చూస్తే మాత్రం అటువంటి కారణం ఏదైనా ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది. టీటీడీ లడ్డు కల్తీ కి సంబంధించి వై వి సుబ్బారెడ్డి ని అరెస్ట్ చేస్తే ఆనందించే మొదటి వ్యక్తిని తానే అవుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారంటే.. ఆయన మనసు ఇట్టే అర్థమయిపోతుంది. బావమరిది బతుకు కోరుతాడు అంటారు.. కానీ అదే బావమరిది బాలినేని శ్రీనివాస్ రెడ్డి బావ వైవి సుబ్బారెడ్డి విషయంలో ఎందుకలా మారిపోయాడో తెలియడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి కి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బావమరిది అవుతారు. వారిద్దరూ ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాలినేనిని వై వి సుబ్బారెడ్డి చాలా ఇబ్బంది పెట్టారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు జనసేనలో చేరే అక్క కూడా వైవి విమర్శలు చేస్తున్నారు. దీంతో ఓర్పు నశించిన బాలినేని బ్లాస్ట్ అవుతున్నారు.

Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!

* రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
గత కొద్ది కాలంగా బావ, బావమరుదుల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. 1999లో కాంగ్రెస్ యువజన నాయకుడిగా ఉండేవారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కి ( y s Rajasekar Reddy ) వై వి సుబ్బారెడ్డి రికమండేషన్ చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. తొలి చాన్స్ లోనే విజయం సాధించిన బాలినేని ఒంగోలులో పాతుకు పోయారు. 2004, 2009, 2012 ఎన్నికల్లో గెలిచారు. వరుస విజయాలతో జిల్లా స్థాయి నేతగా ఎదిగారు. 2009లో గెలిచిన బాలినేనిని మంత్రిని చేశారు రాజశేఖర్ రెడ్డి. అది కూడా వై వి సుబ్బారెడ్డి ఒత్తిడితోనేనని తెలుస్తోంది. బహుశా ఒకే కుటుంబం అని భావించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం మంత్రి పదవిని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే కు రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు.

* వైవి సుబ్బారెడ్డి ఎంట్రీతో..
2014 ఎన్నికల్లో ఓడిపోయారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండే సమయంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చూసేవారు వైవి సుబ్బారెడ్డి. అయితే 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాలుగు సీట్లను గెలుచుకుంది. కానీ ఆ నలుగురు టిఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో వైవి సుబ్బారెడ్డి తిరిగి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. జగన్ పక్కన చేరారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి గెలవగా.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయారు. తొలిసారిగా ఓడిపోయిన బాలినేనికి కంట్లో నలుసుగా మారారు వైవి సుబ్బారెడ్డి. ప్రకాశం జిల్లా పై పట్టు సాధించడానికి ప్రయత్నం చేశారు. అది ఎంత మాత్రం బాలినేనికి మింగుడు పడలేదు. ఈ క్రమంలోనే బావ బావమరుదులు ఇద్దరు ఒకరిపై ఒకరు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో బాలినేని సూచన మేరకు వైవి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా కు దూరంగా ఉంచారు జగన్. దీంతో ఒంగోలు నుంచి గెలిచిన బాలినేనికి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కింది. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలింది. దానికి కారణం వై.వి సుబ్బారెడ్డి అని బలంగా నమ్మారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై అలకపాన్పు ఎక్కడ ప్రారంభించారు. ఇదే అదునుగా వైవి సుబ్బారెడ్డి బాలినేనిని ఎంత తొక్కాలో అంతలా తొక్కారు.

* విసిగిపోయిన జగన్..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy) విషయంలో జగన్మోహన్ రెడ్డి విసిగిపోయారు. ఒకానొక దశలో 2024 ఎన్నికల్లో బాలినేనికి వైసీపీ టికెట్ దక్కదని కూడా ప్రచారం జరిగింది. దీని వెనుక వైవి సుబ్బారెడ్డి హస్తం ఉందన్నది బాలినేని అనుమానం. అయితే మా గుంట శ్రీనివాసులరెడ్డిని బయటకు పంపించి తనని ఒంటరి చేశారన్న అనుమానం కూడా ఆయనలో ఉంది. పైగా తనకంటే ఆర్థికంగా వైవి సుబ్బారెడ్డి బలపడ్డారన్నది బాలినేని లో ఉన్న ఒక రకమైన అనుమానం. పైగా ఓడిపోయిన తరువాత బాలినేనికి ప్రాధాన్యం లేకుండా పోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గౌరవం కూడా తగ్గింది. అందుకే ఆయన జనసేనలో చేరిపోయారు. అయితే తన రాజకీయ పతనానికి కారణం అయిన వై వి సుబ్బారెడ్డి పై మాత్రం ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలినేని. అందుకే వైవి సుబ్బారెడ్డి అరెస్టు అయితే ఆనందించే తొలి వ్యక్తి తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో బంధుత్వాలకు తావు లేదని ఈ బావ బావమరుదుల ఎపిసోడ్ తేల్చింది.

Exit mobile version