Y S Vivekananda Reddy Case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy) హత్య కేసు విచారణ మళ్లీ ప్రారంభం అయింది. సుమారు రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. వాస్తవానికి హత్య కేసు విచారణను ముగించింది సిబిఐ. అయితే కీలక అంశాలను విడిచిపెట్టి సిబిఐ విచారణ చేపట్టిందని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు మళ్లీ విచారణ చేపట్టాలని సిబిఐ ను ఆదేశించింది. వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని కూడా సూచించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగింది సిబిఐ. పులివెందులలో విచారణ మొదలుపెట్టింది. శుక్రవారం కొంతమందిని విచారించగా.. ఈరోజు మరి కొంతమందిని విచారించే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read: సజ్జల ఔట్.. ఆ ప్లేస్ లో కొత్త నేత!
* ఫోన్ సంభాషణల చుట్టూ..
వివేకానంద రెడ్డి హత్య వేకువ జామున జరిగితే.. అర్థరాత్రి ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనే అంశం చుట్టూనే తాజాగా విచారణ మొదలైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ సంభాషణల చుట్టూ ఈ విచారణలు జరుగుతున్నట్లు సమాచారం. బాహ్య ప్రపంచానికి తెలియక ముందే కొంతమంది ఈ హత్య అంశంపై ఫోన్లో సంభాషించుకోవడాన్ని సిబిఐ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో పలువురు అనుమానితులను విచారించారు సిబిఐ అధికారులు. ఈ కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్, అలాగే నిందితుడు సునీల్ యాదవ్, ఆయన సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ లను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే గతానికి భిన్నంగా సిబిఐ విచారణ జరుగుతుండడం విశేషం.
* సునీత కోరిన విధంగా..
2019 మార్చి 15 రాత్రి దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అయితే అర్థరాత్రి ఫోన్ సంభాషణల చుట్టూ ఇప్పుడు సిబిఐ విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే.. అంటే అర్థరాత్రి 1:40 గంటలకు కిరణ్ యాదవ్ తన వాట్సాప్ నుంచి అర్జున్ రెడ్డి అనే వ్యక్తికి కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అసలు వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? హత్య గురించి ముందే సమాచారం ఉందా? అనే కోణంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతకుముందే హైదరాబాదులో సిబిఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని ప్రశ్నించి రికార్డు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సునీత రెడ్డి కోరిన విధంగానే ఫోన్ సంభాషణలపై సిబిఐ దృష్టి పెట్టింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన ఫోన్ సంభాషణలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తే.. అసలు దోషులు ఎవరనేది తేలుతుందని ఇదివరకే చాలా సందర్భాల్లో సునీత రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే అంశంపై విచారణ కొనసాగుతుండడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. మున్ముందు వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.