Trump Iran Deal: ఇరాన్తో యుద్దం మొదలు పెట్టి ఇజ్జత్ తీసుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించేందుకు తంటాలు పడుతున్నారు. చర్చల పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టారు. అయితే పాకిస్తాన్ చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒక ముఖ్యమైన ఒప్పందం దాదాపు ఖరారు అయిందని ప్రకటించారు. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఆశావాదాన్ని కలిగించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్, బహ్రెయిన్ వంటి ప్రముఖ దేశాల నేతలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయని ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధిని తెరవడం ఈ ఒప్పందంలో కీలక అంశమని వెల్లడించడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో విడిగా మాట్లాడినట్లు కూడా పేర్కొన్నారు.
ఒప్పందం వెనుక ప్రాముఖ్యత
హార్ముజ్ జలసంధి ప్రపంచ శక్తి మార్కెట్కు ఎంతో కీలకం. చమురు రవాణా ఈ మార్గం గుండానే సాగుతుంది. మూడు నెలలుగా ఇరాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఈ జలసంధి మూసివేత భయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలచివేసింది. ఇప్పుడు దానిని తెరవడం ద్వారా చమురు, గ్యాస్ సరఫరాలు సాఫీగా కొనసాగే అవకాశం ఏర్పడింది. ఈ ఒప్పందం ఇరాన్ను మళ్లీ ప్రధాన రాజకీయ–ఆర్థిక వేదికపైకి తీసుకురావడంతో పాటు, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి ప్రయత్నాలకు బాటలు వేస్తుందని ఆశించవచ్చు. అరబ్ దేశాలు, తుర్కియే, పాకిస్తాన్ వంటి దేశాలను ఒకే వేదికపైకి తెచ్చడం ట్రంప్ యొక్క దౌత్య విజయంగా చెప్పవచ్చు.
భారత్కు రిలీఫ్..
ఖతార్, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీ, ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడిన భారత్కు ఈ అభివృద్ధి సానుకూలం. హార్ముజ్ సంక్షోభం తగ్గితే ఇంధన ధరలు స్థిరపడతాయి, సరఫరా గొలుసులు సాఫీ అవుతాయి. ఇరాన్తో సంబంధాలు మెరుగుపడితే చాబహార్ పోర్టు, ఇతర ఇంధన సహకారాలకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి. అయితే, ఇజ్రాయెల్తో జరిగిన విడి చర్చలు ఈ ఒప్పందం సమగ్రమైనదని సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి సున్నితమైన అంశాలపై సమతుల్య విధానం అనుసరించాల్సి ఉంటుంది.
ఒప్పందం సవాళ్లు..
ఒప్పందం దాదాపు ఖరారైనా, తుది వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతంలో ఇలాంటి అనేక ప్రయత్నాలు మధ్యలోనే చీకట్లో కలిసిపోయాయి. ఇరాన్ లోపలి రాజకీయ శక్తులు, ఇజ్రాయెల్ ఆందోళనలు, అమెరికా లోపలి వ్యతిరేక గళాలు ఈ ప్రక్రియను ప్రభావితం చేయవచ్చు. అంతేకాకుండా, ఈ ఒప్పందం దీర్ఘకాలం నిలిచి, నిజమైన శాంతిని తీసుకురావాలంటే అన్ని పక్షాలు రాజీలకు సిద్ధపడాలి. కేవలం ఆర్థిక లాభాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రాంతీయ స్థిరత్వం దిశగా ముందుకు సాగాలి.
ట్రంప్ ప్రకటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, సహకార యుగం మొదలవుతుందని ఆశలు రేపుతోంది. హార్ముజ్ జలసంధి తెరవడం ద్వారా ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరత్వం సాధ్యమవుతుంది. భారత్ వంటి దేశాలకు ఇది శక్తి భద్రతకు బలం చేకూర్చే అవకాశం ఉంది. అయితే, ఈ ఆశావాదం వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. తుది ఒప్పందం ఎంత సమగ్రంగా, అమలు చేయదగ్గదిగా ఉంటుందన్నది కీలకం.
