Pakistan Army Salary Hike: అనేక సమస్యలు, సవాళ్లు, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ తాజాగా సరిహద్దుల నుంచి అంతర్గత భద్రతా సమస్యల వరకు సైన్యం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇటీవలి సంఘటనలు సైనికుల మనోబలాన్ని ప్రభావితం చేశాయి. దీంతో సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మనోబలం పెంచే ప్రయత్నం చేయాలి. కానీ ఆయనకే మనోబలం తక్కువ. అందుకే మనీ బలంతో సైనికుల్లో ధైర్యంపెంచే ప్రయత్నం చేస్తున్నారు. వేతనాలు, అలవెన్సులు పెంచడం ద్వారా సైనికులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ ప్రభావం..
2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ వైమానిక రంగంపై గణనీయమైన ప్రభావం చూపిందని నివేదికలు సూచిస్తున్నాయి. రాడార్ వ్యవస్థలు, రన్వేలు, డ్రోన్ ఆపరేటింగ్ సిస్టమ్లు పనిచేయకపోవడం, నూర్ ఖాన్ ఎయిర్బేస్, కిరాణా హిల్స్ వంటి కీలక స్థావరాలపై దెబ్బలు తగిలినట్లు సమాచారం. ఇది సైనికుల్లో భయం, అసహనం పెరగడానికి దోహదపడింది. టీటీపీ (తెహ్రీక్–ఎ–తాలిబాన్ పాకిస్తాన్) దాడులు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సైన్యం తన బలగాల మనోబలాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది.
అంతర్గత భద్రతా సవాళ్లుబ..
లూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే), ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో సైనికులపై దాడులు తరచుగా జరుగుతున్నాయి. బలూచ్ విముక్తి సంస్థలు, టీటీపీ వంటి సమూహాలు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బలూచిస్తాన్లోని కొన్ని దాడుల్లో వందలాది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పీవోకేలో సైనికులపై స్థానికుల తిరుగుబాట్లు పెరిగాయి. ప్యాంట్లు, షర్టులు ఊడదీసి కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనికులు బలూచిస్తాన్ వంటి ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి వెనుకాడుతున్నారని, కొందరు భయంతో రాజీనామా చేసినట్లు సమాచారం.
విటమిన్ ఎంతో ఊరట..
ఈ నేపథ్యంలో ఆసిమ్ మునీర్ నేతృత్వంలో సైన్యం సైనికులు, అధికారుల వేతనాలను సుమారు 25 శాతం పెంచింది. ఉదాహరణకు, లక్ష రూపాయల వేతనం ఉన్నవారికి ఇప్పుడు 1.25 లక్షలు లభిస్తాయి. ఇది సైనికుల మనోబలం, ఆత్మవిశ్వాసం పెంచడానికి చేసిన చర్యగా చెబుతున్నారు. పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సైన్యం ప్రాధాన్యతను ఇచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
అలవెన్సుల పెంపు..
వేతనంతోపాటు డిస్టర్బెన్స్ అలవెన్స్ను మూడింతలు పెంచారు. హై–రిస్క్ జోన్లు బలూచిస్తాన్, పీవోకే, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో విధులు నిర్వహించే సైనికులకు ఇది అదనపు ప్రోత్సాహం. మంచి పనితీరుకు ఇచ్చే అలవెన్స్ను డబుల్ చేశారు. బ్యాట్మెన్ అలవెన్స్, యూనిఫాం అలవెన్స్ వంటివి కూడా రెట్టింపు చేశారు. ఈ చర్యలు సైనికులను ఉత్సాహపరచి, ఉద్యోగ వ్యతిరేకతను తగ్గించడానికి ఉద్దేశించినట్లు అర్థం అవుతోంది.
వేతనలా పెంపు మాత్రమే చాలదు..
వేతనాల పెంపు స్వల్పకాలికంగా మనోబలం పెంచవచ్చు. అయితే, దీర్ఘకాలికంగా సైనికుల్లో దేశభక్తి, నాయకత్వంపై నమ్మకం, ఆపరేషన్ల విజయం, దేశ ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు ముఖ్యం. పాకిస్తాన్లో సైన్యంలో అసంతృప్తి, ఇమ్రాన్ ఖాన్ అనుకూలులు, ఫాయిజ్ హమీద్ అనుకూలులు వంటివారు ఆసిమ్ మునీర్పై అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు మాత్రమే సమస్యలను పరిష్కరించలేదు. భారత సైన్యంలో వేతనాలు పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. అక్కడ సైనికుల్లో దేశభక్తి, శిక్షణ, నాయకత్వం బలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో ఈ అంశాలు బలహీనంగా ఉంటే, వేతనాల పెంపు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది.
పాకిస్తాన్ సైన్యం ప్రస్తుతం మనోబలం, ఆర్థిక ఒత్తిడి, అంతర్గత దాడుల మధ్య సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వేతనాలు, అలవెన్సుల పెంపు ఒక అడుగు అయినప్పటికీ, నిజమైన మార్పు కోసం విస్తతమైన సంస్కరణలు, ఆపరేషన్ల విజయం, దేశ ఐక్యత అవసరం.

