టిక్ టాక్ కు ట్విస్ట్.. అమెరికా సంస్థకేనా‌..?

చైనా యాప్‌ అయిన టిక్‌టాక్‌ను ఇప్పటికే భారత్‌ బ్యాన్‌ చేయగా.. అదే బాటలో అమెరికా కూడా నిర్ణయం తీసుకుంది. అమెరికాలోనూ టిక్‌టాక్‌పై ట్రంప్‌ ఫైర్‌‌ అయ్యారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం టిక్‌టాక్‌ ద్వారా చైనా దొంగిలిస్తోందంటూ ఆరోపించారు. 90 రోజుల్లో తమ దేశ సంస్థకు విక్రయించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ సమయంలో యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో టేక్‌ ఓవర్‌‌ చేసేందుకు ముందుకు రాగా.. తాజాగా ఒరాకిల్‌ సంస్థ పరం కానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు […]

Written By: NARESH, Updated On : September 15, 2020 11:51 am

Trump tick talk

Follow us on

చైనా యాప్‌ అయిన టిక్‌టాక్‌ను ఇప్పటికే భారత్‌ బ్యాన్‌ చేయగా.. అదే బాటలో అమెరికా కూడా నిర్ణయం తీసుకుంది. అమెరికాలోనూ టిక్‌టాక్‌పై ట్రంప్‌ ఫైర్‌‌ అయ్యారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం టిక్‌టాక్‌ ద్వారా చైనా దొంగిలిస్తోందంటూ ఆరోపించారు. 90 రోజుల్లో తమ దేశ సంస్థకు విక్రయించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ సమయంలో యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో టేక్‌ ఓవర్‌‌ చేసేందుకు ముందుకు రాగా.. తాజాగా ఒరాకిల్‌ సంస్థ పరం కానున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్‌కు బదులు టిక్‌టాక్‌ ఒరాకిల్‌ను ఎంచుకున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘అమెరికాలోని టిక్‌టాక్ కార్యకలాపాలను మాకు అమ్మేది లేదంటూ బైట్‌డ్యాన్స్‌ మాకు సమాచార మిచ్చింది’ అని మైక్రోసాఫ్ట్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Also Read : చదువుల సంగతి ఏమి కానుంది?

‘మేమిచ్చిన ఆఫర్ టిక్‌టాక్ యూజర్లకు ఎంతో ఉపయోగకరమని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. ఇది అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చే ఒప్పందం. దేశ భద్రత, సమాచార గోప్యత కోసం మేము అత్యున్నత ప్రమాణాలను ఈ ఒప్పందంలో భాగం చేసుండేవాళ్లం’ అని మైక్రోసాఫ్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే ఈ విషయంపై టిక్‌టాక్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. మరోవైపు ఒరాకిల్ సంస్థ కూడా ప్రస్తుతానికి మౌనమే పాటిస్తోంది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనా మీద ఇప్పటికే అమెరికా గుస్సా మీద ఉంది. చైనా దేశం నుంచే పుట్టించారని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పటికప్పుడు ఆరోపిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో చైనా, అమెరికా మధ్య టిక్‌టాక్ కూడా కేంద్ర బిందువుగా మారింది. చైనా యాప్ టిక్‌టాక్ కారణంగా అమెరికా భద్రతకు ముప్పంటూ ట్రంప్ గతంలోనూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. అమెరికా యూజర్ల సమాచారం ఆధారంగా దేశ పౌరులపై చైనా నిఘా పెడుతోందని, ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ట్రంప్ ఆరోపించారు.

90 రోజుల్లో అమెరికా సంస్థకు విక్రయించకుంటే నిషేధం విధిస్తామంటూ ఇటీవల అమెరికా కార్యనిర్వహక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌తో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ చర్చలు ప్రారంభించింది. మరో అమెరికా సంస్థ ఒరాకిల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ బైట్‌‌డ్యాన్స్ తమ ఆఫర్‌ను తిరస్కరించిందంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అదే సమయంలో ఈ యాప్ ఒరాకిల్ పరం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.

Also Read : మన కరోనా వ్యాక్సిన్‌ మరింత లేట్‌..వచ్చే ఏడాదే?