Middle East War Iran Strategy: యుద్ధం అంటే దాడులు, ప్రతిదాడులు మాత్రమే కాదు.. ఆర్థికంగా నష్టం చేకూర్చడం కూడా ఒకరకంగా యుద్ధమే. అలాంటి విధానాన్ని చేపడితే శత్రుదేశం తలవంచక తప్పదు. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కూడా ఇటువంటి విధానాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ వద్ద చెప్పుకునే స్థాయిలో మిసైల్స్ లేవు. సైన్యం చేతిలో అత్యంత ఆధునికమైన ఆయుధాలు లేవు. బలమైన ఇజ్రాయిల్.. అంతకంటే శక్తివంతమైన అమెరికా నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇరాన్ చేస్తున్న యుద్ధం పేరు “అట్రిషన్ వార్”.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
అట్రిషన్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో అనేక అర్ధాలు ఉన్నాయి. ప్రత్యర్థికి భారీ నష్టాన్ని కలిగించడం అనే అర్థం వచ్చేలా అట్రిషన్ అనే పదాన్ని వాడుతుంటారు. ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ అట్రిషన్ వార్ ను చేపడుతోంది. ఈ వార్ ఉద్దేశం ప్రత్యర్థికి భారీ నష్టాన్ని కలగజేయడమే. యుద్ధరంగంలో శత్రువుల జేబులను ఖాళీ చేసి.. వారు వెనకడుగు వేసేలా చేయడమే దీని వెనుక ఉన్న అసలు పరమార్థ.
మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయిల్, అమెరికా అత్యంత ఖరీదైన ఆయుధాలను.. యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాయి. ఈ రెండు దేశాల యుద్ధ విమానాలను.. డ్రోన్లను ఎదుర్కోవడానికి ఇరాన్ చౌకైన విధానాన్ని అవలంబిస్తోంది. తక్కువ ఖర్చుతో తయారుచేసిన షాహిద్ 136 డ్రోన్లతో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ విమానాలను ఇరాన్ పడగొడుతోంది. షాహిద్ 136 ను వన్ వే అటాక్ డ్రోన్ అని పిలుస్తుంటారు. ఇవి చిన్న క్రూయిజ్ మెసేజ్ మాదిరిగా పనిచేస్తుంటాయి. టార్గెట్ రీచ్ కావడమే ఆలస్యం.. ఇవి వెంటనే పేలిపోతాయి. ఒక రకంగా వీటిని ఆత్మహుతి డ్రోన్లు అని పిలుస్తుంటారు.
ఒక్క డ్రోన్ తయారు చేయడానికి దాదాపు 16 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇవే డ్రోన్లను ఎదుర్కోవడానికి గల్ఫ్, అమెరికా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇజ్రాయిల్ ప్రస్తుతం ఐరన్ డోమ్ అనే రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఇందులో ఒక్కో మిస్సైల్ ధర 35 నుంచి 45 లక్షల వరకు ఉంటుంది. ఇక విమానాల నుంచి సైడ్ వైండర్ మిస్సైల్స్ ను ప్రయోగించినప్పుడు.. ఆ ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థలో ఉపయోగించే ఇంటర్ సెప్టార్ మిస్సైల్ ధర 30 కోట్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను కూల్చివేయాలంటే అమెరికా, ఇజ్రాయిల్ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యుద్ధం ఇలానే సాగిపోతే ఇజ్రాయిల్, అమెరికా వద్ద ఉన్న ఖరీదైన మిస్సైల్స్ ఒక్కసారిగా ఖాళీ అవుతాయి. అప్పుడు వాటిని రూపొందించాలంటే ఈ రెండు దేశాలు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాలలో ఇప్పటికే మిస్సైల్స్ సంఖ్య తగ్గిపోతుందని తెలుస్తోంది. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్రోన్ లు తయారు చేసి ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.