Mauritius Indian tourists cheated: మనం ఏదైనా హోటల్ వెళితే.. అక్కడి నిర్వాహకులు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు. మనకు ఏది ఇష్టమో కనుక్కొని.. అది టేబుల్ ముందుకు తెచ్చి పెడతారు. ఒకవేళ మనం రూమ్ బుక్ చేసుకుంటే.. మనం చెల్లించిన రుసుము ఆధారంగా సౌకర్యాలు కల్పిస్తారు. ఇక విదేశాలలో అయితే మనం చెల్లించిన డబ్బు ఆధారంగా సౌకర్యాలు లభిస్తాయి. తినే తిండి నుంచి.. తాగే నీరు వరకు.. ప్రతి దాంట్లో మనం కోరుకున్న విధంగా హోటల్ నిర్వాహకులు సర్వ్ చేస్తూ ఉంటారు.
విదేశాలలో భారతీయులకు మంచి సత్కారాలు లభిస్తాయి. హోటల్ నిర్వాహకులు అద్భుతమైన హాస్పిటాలిటీ అందిస్తారు. కానీ ప్రకృతి ఒడిలో ఆస్వాదించాలని.. అద్భుతమైన రుచులను ఆరగించాలని మారిషస్ వెళ్లిన భారతీయ కుటుంబానికి దారుణమైన అనుభవం ఎదురయింది. వారికి అడుగడుగున జాతి వివక్ష ఎదురు కావడంతో నరకం చూశారు.
ఆ యువకుడికి కొత్త ఉద్యోగం వచ్చింది. తనకు ఉద్యోగం రావడానికి ప్రధాన కారణమైన తల్లిదండ్రులకు గొప్ప కానుక ఇవ్వాలని అతడు భావించాడు. దానికి తగ్గట్టుగా తన తల్లిదండ్రులను మారిషస్ తీసుకెళ్లాడు. అక్కడ పంచతార రిసార్ట్ లో ఒక రూమ్ బుక్ చేశాడు. తన తల్లిదండ్రులకు అద్భుతమైన విందు ఇవ్వాలని భావించాడు. అయితే అతడికి ప్రతిక్షణం ఇబ్బంది ఎదురైంది. ఈస్టర్ పండుగ రోజు టేబుల్ బుక్ చేస్తే.. ఖాళీ లేవని చెప్పారు. 15 నిమిషాలలో సమాచారం ఇస్తామని చెప్పి.. గంటలు గడిచినా కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు. చివరికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఆకలితో ఇబ్బంది పడ్డారు. గత్యంతరం లేక హౌస్ కీపింగ్ సిబ్బందికి వద్దకు వెళ్లారు. దీంతో హౌస్ కీపింగ్ సిబ్బంది ఈస్టర్ పండుగ సందర్భంగా హోటల్ నిర్వాహకులు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారని. అక్కడికి వెళ్లాలని సూచించారు.
ఈస్టర్ పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు వద్దకు వారు వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని హోటల్ నిర్వాహకులు సమాధానం చెప్పారు. అదే సమయంలో ఒక శ్వేత జాతీయుడు అక్కడికి రాగానే… అతడికి వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ వడ్డించారు.. 3.5 లక్షలు చెల్లించినప్పటికీ తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వకపోగా.. తినే తిండి విషయంలో కూడా వివక్ష చూపించడంతో ఆ యువకుడు తన బాధను మొత్తం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకుల వద్దకు అతడు తీసుకెళ్తే.. వారు నిర్లక్ష్యంగా మీ ఫీడ్ బ్యాక్ చెప్పండి మేం రాసుకుంటామని అనడం విశేషం. తనకు జరిగిన అన్యాయాన్ని ఇలా సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. గతంలో కూడా మాల్దీవులకు భారతీయులు వెళ్లినప్పుడు ఇటువంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఇప్పుడు మారిషస్ లో కూడా ఓ భారతీయ కుటుంబానికి ఇటువంటి అనుభవం ఎదురు కావడం.. చర్చకు దారి తీస్తోంది.