Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే ప్రజల్లో సంతృప్తి శాతం కనిపిస్తోంది. ఇదే సానుకూలతతో ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం కల్పించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఒక వేడుకగా జరపాలని చూస్తోంది. అయితే ప్రభుత్వం తదుపరి టార్గెట్ పోలవరం ప్రాజెక్టు అని తెలుస్తోంది. 2029 సార్వత్రిక ఎన్నికల కు ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి జాతికి అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది.
* క్యాబినెట్ లో చర్చ..
నిన్ననే క్యాబినెట్ సమావేశం జరిగింది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై సుదీర్ఘ చర్చ సాగింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం క్యాబినెట్లో వ్యక్తం అయింది. సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయంపై చర్చలు జరిపారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి కానుండడంతో.. అదే సమయంలో పుష్కరాలు జరుగుతుండడంతో.. ఆ శుభ సమయంలో ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే.. చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం గోదావరి తీర ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
* ఆది నుంచి ప్రాధాన్యం..
ఆది నుంచి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యమిస్తూ వచ్చారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ నిర్మాణ బాధ్యత ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అప్పట్లో పోలవరానికి వారంలో ఒక్కరోజు కేటాయించేవారు చంద్రబాబు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. మళ్లీ కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యమిస్తోంది. భారీగా నిధులు సైతం సమకూర్చింది. ఒక రెండేళ్లుగా పనులు ఊపందుకోవడంతో ఇప్పుడిప్పుడే ఉలిక్కి వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి తుది దశ పనులు పూర్తికానున్నాయి. అదే సమయంలో గోదావరి పుష్కరాలు జరగనుండడంతో.. అదే సమయంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. క్యాబినెట్ సహచరుల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాండడంతో ఒక రకమైన సానుకూలత వ్యక్తం కానుంది. ఇంకోవైపు గోదావరి పుష్కరాల సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో గొప్ప మైలేజ్ రానుంది.



