Maldives: భారత్‌ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు.. అట్లుంటది మరీ!

చైనా అనుకూల విధానం అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఈ క్రమంలో పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతినడంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సమతమతమవుతోంది.

Written By: Raj Shekar, Updated On : April 12, 2024 2:16 pm

Maldives

Follow us on

Maldives: భారత్‌తో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్లుంది. చైనా అండ చూసుకుని భారత్‌లో కయ్యానికి కాలు దువ్విన మాల్దీవులు ఇప్పుడు అసలుకే ఎసరు వస్తుందని గుర్తించింది. భారత్‌ తీసుకున్న నిర్ణయంలో ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరైన పర్యాటకానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో దిగొచ్చిన మాల్దీవులు.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఏమైందంటే..
చైనా అనుకూల విధానం అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. ఈ క్రమంలో పర్యాటకరంగం పూర్తిగా దెబ్బతినడంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సమతమతమవుతోంది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన మాల్దీవులకు ఇప్పుడు భారత్‌ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ భారతీయులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత్‌లోని ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని మాల్దీవ్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ట్రావెలింగ్‌ ఏజెంట్స్‌ అండ్‌ టూర్‌ ఆపరేటర్స్‌ భావిస్తోంది. ఇందుకు భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతోంది.

మనమే కీలక మార్కెట్‌..
మాల్దీవులకు భారతే ఇప్పటికీ కీలక మార్కెట్‌. ఈ క్రమంలో తమ దేశాన్ని ఒక ప్రధాన గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు భారత్‌లోని ప్రముఖ ట్రావెల్‌ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది. ప్రధాన నగరాల్లో రోడ్‌ షోల నిర్వహణకు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఇతర ప్రముఖులను రప్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలను పెపొందించడంలో భారత హైకమిషన్‌తో కలిసి పనిచేస్తామని ట్రావెన్స్‌ సంస్థ తెలిపింది.

ఆరో స్థానానికి భారత్‌..
ఇక మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉండే భారత్‌.. ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. అధికారుల లెక్కల ప్రకారం.. ఈఏడాది ఏప్రిల్‌ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. ఇందులో 71,995 మందితో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్‌(66,999), రష్యా(66,803), ఇటలీ(61,379), జర్మనీ(52,256), భారత్‌(37,417)తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత పర్యాటకులు 60 శాతానికిపైగా తగ్గడంతో మాల్దీవుల ఆదాయం భారీగా పడిపోయింది. ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.