Strait Of Hormuz Importance In Global Trade: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జల సంధి లో సరుకు రవాణాపై ఆంక్షలు విధించింది. అమెరికా పట్టింపులకు పోతున్న నేపథ్యంలో వ్యవహారం మరింత తీవ్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ జల సంధి గురించి అంతర్జాతీయ మీడియా నుంచి మొదలుపెడితే స్థానిక మీడియా వరకు ప్రతిరోజు విశ్లేషణాత్మక కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి ప్రపంచంలో హర్ముజ్ మాత్రమే కాకుండా అనేక కాల్వలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచానికి సరిపడా వాణిజ్యం మొత్తం జరుగుతూ ఉంటుంది. వీటిల్లో ఏమాత్రం చిన్న అవాంతరం తలెత్తినా చాలు ప్రపంచం మొత్తం తలకిందులౌతుంది.
ఆకాశయానం.. రోడ్డు మార్గాలు వీపరితంగా అభివృద్ధి చెందినప్పటికీ.. జల రవాణా అనేది అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకొని ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా సరుకు రవాణా మొత్తం జల మార్గాల ద్వారానే సాగుతూ ఉంటుంది. ఒకరకంగా జల రవాణాను ప్రపంచానికి జీవనాడి అని చెప్పుకోవచ్చు. తాజాగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల హర్ముజ్ జల సంధి లో సరుకు రవాణా అయిపోయింది. ఇలా సరుకు రవాణా ఆగిపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 20% వ్యాపారం స్తంభించిపోయింది. ఈ వ్యాపారం మొత్తం కూడా చమురు, పెట్రో ఉత్పత్తులకు సంబంధించినది. హర్ముజ్ మాత్రమే కాకుండా.. ప్రపంచంలో జల రవాణా జరిగే మార్గాలు అనేకమున్నాయి.
పనామా కాల్వ
ఇది అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ ఉంటుంది. ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఈ కాలువ నిర్మించారు. ఈ కాల్వ మీదుగా అమెరికా నుంచి ఆసియా మార్కెట్ల వైపు సరుకు రవాణా చేస్తుంటారు. 13వేలకు పైగా నౌకలు ఈ మార్గంలో సరుకు రవాణా చేస్తూ ఉంటాయి.. చైనా, దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, చిలి వంటి దేశాలకు సంబంధించిన సరుకు రవాణా ఈ కాలువ ద్వారా సాగుతూ ఉంటుంది. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ కాల్వను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే పనామా తీవ్రంగా ప్రతిఘటించడంతో ట్రంప్ వెనక్కి తగ్గారు. అయితే ఏ క్షణమైనా మళ్ళీ స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరగవచ్చని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో వరదలు వస్తుంటాయి. కరువు కూడా చోటు చేసుకుంటుంది. పొగ మంచు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ధూళి మేఘాలు ఏర్పడుతూనే ఉంటాయి.. నౌకలు నిత్యం మరమ్మతులకు గురవుతూనే ఉంటాయి.
సూయజ్ కాలువ
ఇది మానవ నిర్మితమైన కాలువ. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రాన్ని కలుపుతూ నిర్మించారు. ఇది ఈజిప్టు ప్రాంతంలో ఉంది. 1869 లో దీని మీదుగా రాకపోకలు మొదలయ్యాయి. 200 మీటర్ల వెడల్పు ఉంటుంది. 163 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 15 గంటలు ప్రయాణిస్తే తప్ప దీనిని దాటడం సాధ్యం కాదు. వరల్డ్ ట్రేడ్ లో 12 శాతం.. 30% కంటైనర్ ట్రాఫిక్ కు ఇది కీలకమైన మార్గం. ప్రతి ఏడాది 19 వేలకు పైగా నౌకలు ఈ మార్గం మీదుగా ప్రయాణిస్తుంటాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఎవర్ గివెన్ అనే పెద్ద ఓడ ఈ కాలువలో అడ్డం తిరిగింది. దీంతో ప్రపంచంలో సగం వాణిజ్యం ఆగిపోయింది. ఆ తర్వాత మరమ్మతులు చేయడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
మలక్కా జల సంధి
ఇది ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ మధ్యలో ఉంటుంది. మన దేశానికి అత్యంత దగ్గరలో ఉంటుంది. హిందూ, పసిఫిక్ సముద్రాలను ఇది కలుపుతుంది. ఇది అత్యంత ఇరుకైన మార్గం. 1.5 నాటికల్ మైళ్ళు ఉంటుంది. 30 శాతం ప్రపంచ వాణిజ్యం మొత్తం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. చైనాకు ఈ మార్గం ద్వారానే ఇంధనం రవాణా అవుతుంది. 40% కంటైనర్లు దీని మీద గానే ప్రయాణం సాగిస్తుంటాయి.
హర్ముజ్ జల సంధి
ఇరాన్, ఒమన్, యూఏఈ లో ఈ జల సంధికి తీరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20% ఎల్ ఎన్ జి, రోజుకు రెండు కోట్ల బ్యారెళ్ళ దీని ద్వారా రవాణా అవుతుంది. గల్ఫ్ దేశాలు ఎగుమతులు.. దిగుమతులు పొందాలంటే ఈ మార్గమే ముఖ్యం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల ఇది మూతపడింది. అటు అమెరికా. ఇటు ఇరాన్ ఈ మార్గంలో సరుకు రవాణా మొత్తాన్ని అడ్డుకుంటున్నాయి.
బాబ్ ఎల్ మండెప్ జల సంధి
ఇది యోమన్, జిబూటీ, ఎరిత్రియా తీరాల మధ్య ఉంటుంది. ఎర్ర సముద్రం ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ తో ఇది కలుపుతుంది. ప్రపంచంలో ఉన్న వాణిజ్యంలో 12 శాతం.. కంటైనర్ ట్రాఫిక్ విభాగంలో 30% ఈ మార్గం ద్వారా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో హూతీలు దాడులు చేయడం వల్ల నౌకాయానం అత్యంత కఠినంగా మారింది. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం 26, 000 నౌకలు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగించాయి. గత ఏడాది వీటి సంఖ్య 12వేల 700కు పడిపోయింది. చాలా వరకు నౌకలు కేఫ్ అప్ గుడ్ హోప్ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తున్నాయి.
తుర్కియే జల సంధి
నల్ల సముద్రాన్ని, మధ్యధర సముద్రాన్ని కలుపుతూ తుర్కియే ప్రాంతంలో భాస్పరస్, డర్ద నెల్స్ జల సంధులు ఉన్నాయి. నల్ల సముద్రం నుంచి అంతర్జాతీయంగా ఉన్న సముద్ర జలాల్లోకి నౌకలు వెళ్లిపోవాలంటే ఈ మార్గం మీదుగా ప్రయాణించాల్సిందే.
