India Australia Nuclear Cooperation: భారత ప్రధాని నరంద్రమోదీ ఆరు రోజుల పాటు మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. ఇప్పటికే ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆస్ట్రేలియాలోనూ మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా–భారత్ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్లోని అణు విద్యుత్ కేంద్రాలకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య పౌర అణుశక్తి సహకారంపై కీలక ఒప్పందం కుదిరింది. 12 సంవత్సరాల క్రితం కుదిరిన చారిత్రాత్మక అణు ఒప్పందం తర్వాత ఇది మరో ముఖ్యమైన అడుగు. ఈ ఒప్పందం భారత్ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను మరింత బలపరుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
మెల్బోర్న్లో మోదీ–అల్బానీస్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, సాంకేతికత, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం వంటి అంశాలపై విస్తతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికత, సప్లై చైన్లు, రక్షణ, సముద్ర భద్రత, ఇంధన భద్రత సహా మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
సముద్ర భద్రతా సహకారం
భారత తీర రక్షక దళం, ఆస్ట్రేలియా మారిటైమ్ బోర్డర్ కమాండ్ మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన పెంపు, సరిహద్దుల రక్షణ వంటి అంశాల్లో ఉమ్మడి కషికి దోహదం చేస్తుంది. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసి పనిచేయడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.
ఇంధన భద్రత, ఆర్థిక సహకారం..
బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువు స్థిరమైన సరఫరా ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానం వేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
విద్యా రంగంలో కొత్త అడుగులు
ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత్లో క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లభించింది. గురుగ్రామ్లో విక్టోరియా విశ్వవిద్యాలయం, బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తమ క్యాంపస్లను నిర్వహించనున్నాయి. 2028–29 సంవత్సరానికి ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని కూడా నిర్ణయించారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు..
ఉగ్రవాదం మానవాళి మొత్తానికి సవాలుగా మారిందని ఇరు దేశాలు గుర్తించాయి. దీంతో ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. భారత్తో ఆస్ట్రేలియాకు ఉన్న సంబంధం ఎప్పటికంటే ఇప్పుడు మరింత కీలకమని అల్బానీస్ పేర్కొన్నారు.
పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది. అణు ఒప్పందం భారత్ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు కొత్త బలం ఇస్తుంది. ఈ ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుంది.
