Elon Musk : ట్రంప్ ను గెలిపించేందుకు నడుం బిగించిన ఎలాన్ మస్క్.. ప్రతీ నెల ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నాడంటే..

అమెరికా దేశంలో వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా, ఓ దుండగుడు కాల్పులు జరిపాడు

Written By: Bhaskar, Updated On : July 16, 2024 4:27 pm
Follow us on

Elon Musk : ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందంటే చాలు.. నేతలు చేసే ఖర్చుకు అంతనేది ఉండదు. విందు, వినోదం, మద్యం, కానుకలు.. ఇలా అన్ని మార్గాలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తుంటారు. ఈ ఖర్చు మన దగ్గరే కాదు.. అమెరికాలో కూడా ఉంది. కాకపోతే అమెరికా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి.. అభ్యర్థులు ఓటర్లకు ఇచ్చే తాయిలాలు మరో విధంగా ఉంటాయి. మొన్నటి ఎన్నికల్లో మనదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ చర్చకు కారణమైనట్టే.. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కోసం ప్రఖ్యాత వ్యాపారవేత్త భారీగా ఖర్చు చేస్తానని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అక్కడ మీడియాలో ఇదే విషయంపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే .

త్వరలో ఎన్నికలు

అమెరికా దేశంలో వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా, ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఆ ఘటన తర్వాత రిపబ్లికన్ పార్టీ అధికారికంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను ప్రకటించింది. అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేర్లను వెల్లడించింది. దీంతో అమెరికా రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ట్రంప్ కు మద్దతు పెరుగుతోందని అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ చర్చ జరుగుతుండగానే ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్రంప్ కు అండగా నిలిచాడు. మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సంచలన విషయాన్ని వెల్లడించాడు.

ట్రంప్ కు మద్దతు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కు మద్దతు ఇస్తున్నట్టు మస్కి ప్రకటించాడు. ట్రంప్ గెలిచేందుకు భారీ ఎత్తున నిధులు సమకూర్చేందుకు మస్క్ సిద్ధమయ్యాడు. నవంబర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు.. భారత కరెన్సీ లో చెప్పాలంటే 376 కోట్లు ఇచ్చేందుకు మస్క్ ప్రణాళికలు రూపొందించాడు. ఇదే విషయాన్ని అమెరికా కేంద్రంగా వెలువడే వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది.

మనసు మార్చుకున్నాడు

త్వరలో జరిగే ఎన్నికల్లో అటు ట్రంప్, ఇటు బైడన్ కు నా తరఫు నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందదని
గతంలో ఓ సమావేశంలో మస్క్ వ్యాఖ్యానించాడు. అయితే కొద్ది రోజుల్లోనే మస్క్ తన మనసును పూర్తిగా మార్చేసుకున్నాడు. ట్రంప్ కోసం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి భారీగా విరాళం అందించాడు. అయితే ఎంత స్థాయిలో విరాళం ఇచ్చాడనేది ఇంతవరకు తెలియ రాలేదు. ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత మస్క్ నేరుగానే మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చాడు. ఈసారి మరింత భారీ స్థాయిలో విరాళం ఇచ్చేందుకు మస్క్ సిద్ధమయ్యాడు.

45 మిలియన్ డాలర్లు

మస్క్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సూపర్ పొలిటికల్ ఎలక్షన్ కమిటీకి జూలై నెల నుంచి మొదలు పెడితే నవంబర్ వరకు ప్రతినెలా 45 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు మస్క్ సుమ కథ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ గనుక అదే నిజమైతే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు లభించే అతిపెద్ద విరాళం మస్క్ దే అవుతుంది. ఇప్పటివరకు సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కి ప్రముఖ బ్యాంకర్ థామస్ మేలాన్ ముని మనవడు అత్యధికంగా 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చాడు. మరోవైపు ట్రంప్ కోసం మస్క్ స్నేహితులు విరాళాలు సమకూర్చుతున్నారు. అయితే వారు ఎంత స్థాయిలో ఇచ్చారనేది వెల్లడిస్తామని సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా, గత ఎన్నికల్లో ట్రంప్ ట్విట్టర్ ఖాతాను అప్పటి యాజమాన్యం తొలగించింది. ఆ తర్వాత మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసి, దానికి ఎక్స్ అని పేరు పెట్టాడు. అంతే కాదు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాడు.