China : ప్రపంచం తగలబడి పోతున్నా.. చైనా తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటుంది..

పక్కనున్న భారత్ తో కవ్వింపులకు పాల్పడుతుంది. సరిహద్దుల్లో ఏదో ఒక గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది.. పాకిస్తాన్ దేశాన్ని ఆగమాగం చేసింది. టిబెట్ ను ఆక్రమించింది.. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా దుర్నీతికి అంతూ పొంతూ ఉండదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 24, 2024 5:05 pm

China

Follow us on

China : ప్రపంచం తగలబడిపోతున్నా సరే చైనా తన ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటుంది.. పొరుగున ఉన్న దేశాలతో నిత్యం కయ్యం పెట్టుకుంటూ ఉంటుంది. శ్రీలంకలో పెట్టుబడులు పెడుతున్నామంటూ ఆర్థికంగా నష్టం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా దారుణాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా గాజా యుద్ధంలో చైనా తటస్థ వైఖరి అవలంబించింది. ఇదే సమయంలో లెబనాన్ విషయానికి వచ్చేసరికి తన వైఖరిని వెల్లడించింది. యుద్ధం వల్ల అతలాకుతలం అవుతున్న బీరుట్ కు మద్దతు ఇచ్చింది. బీరుట్ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చైనా వెల్లడించింది.. అయితే చైనా తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. ఇజ్రాయిల్ కు మాత్రం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ చైనా కంటే సాంకేతిక రంగంలో ముందుంది. స్పైవేర్, అంతర్గత రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఇజ్రాయిల్ తో పలుమార్లు చైనా ప్రయత్నించింది. దానికి ఇజ్రాయిల్ ఒప్పుకోలేదు. ఎందుకంటే చైనా సంగతి తెలుసు కాబట్టి ఇజ్రాయిల్ ద్వైపాక్షిక వాణిజ్యానికి పచ్చ జెండా ఊపలేదు. ఇదే సమయంలో భారత్ తో ఇజ్రాయిల్ అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. సహజంగానే చైనాకు ఇబ్బంది కలిగించింది. అందువల్లే ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలుపెట్టింది. సోమవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, లేబర్ మంత్రి అబ్దుల్లా బవూ హాబీబ్ న్యూయార్క్ లో భేటీ కావడం.. ఇజ్రాయిల్ దాడులపై చైనా ఆగ్రహం చేయడం వంటి పరిణామాలు చేస్తున్నారు.

సరిహద్దుల్లో మాటేమిటీ?

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తమ బాధ్యత అని చెప్పిన చైనా.. తన సరిహద్దు దేశాలతో ఎలా వ్యవహరిస్తుందో మాత్రం చెప్పడం లేదు. అరబ్బులను సోదరులుగా పేర్కొన్న చైనా.. పక్కనే ఉన్న టిబెట్ దేశస్థులను ఎందుకు శత్రువులుగా చూస్తుందో మాత్రం వెల్లడించడం లేదు..” లెవెన్ ఆన్ దేశంలో కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లు.. ఇతర పరిణామాలను మేం జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం.. పౌరులపై జరుగుతున్న దాడులను మేము వ్యతిరేకిస్తున్నాం.. శాంతి కోసమే మేం పని చేస్తాం. హింసకు హింసతో పరిష్కారం లభించదని” చైనా పేర్కొనడం ఇక్కడ విశేషం. ఇదే సమయంలో ఇజ్రాయిల్ కూడా ధీటుగానే సమాధానం చెప్పింది.. తమ దేశానికి సంబంధించి రక్షణ అత్యంత ముఖ్యమని.. శత్రు దేశాల వెనుక ఎలాంటి శక్తులు ఉన్నా వెనకడుగు వేయబోమని స్పష్టం చేసింది. అంతేకాదు దక్షిణ లెబనాన్ పై దాడులతో బీకర పరిస్థితులను సృష్టించింది. యుద్ధ విమానాలతో దాడులు చేసింది. బాంబులను వర్షం లాగా కురిపించింది. ఈ దాడుల్లో 400 మందికిపైగా కన్నుమూశారని ఇజ్రాయిల్ మీడియా చెబుతోంది. అంటే ఈ లెక్కన చైనా కాదు కదా దాని తాతలు దిగివచ్చినా మేము వెనకడుగు వేయబోమని ఇజ్రాయిల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.