Nominated posts : 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ.. బిజెపికి అత్యల్పం.. ఎవరెవరికి ఏ పదవులు అంటే?

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన వచ్చింది. 20 పదవులను ప్రకటించారు సీఎం చంద్రబాబు. టిడిపికి ఎక్కువ పదవులు ఇచ్చారు. జనసేనకు సైతం కీలక పదవులు కట్టబెట్టారు. అయితే ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే బిజెపికి అత్యల్పంగా కేటాయించారు.

Written By: Dharma, Updated On : September 24, 2024 4:58 pm

Nominated posts

Follow us on

Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతోంది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మూడు పార్టీల మధ్య పదవుల సర్దుబాటు జరిగింది. తొలి విడతగా కీలక కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటించారు చంద్రబాబు. ఈరోజు 20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ తో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ ల పోస్టులు ప్రకటించారు. గత ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, ఎప్పటినుంచో పార్టీకి విధేయతగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. సమర్థతను సైతం ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే కొంతమంది టిడిపి కీలక నేతల పేర్లు లేకపోవడంతో.. వారికి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

* కీలక పదవులు వారికి
వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నెల్లూరు జిల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్ ను నియమించారు చంద్రబాబు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ శాప్ చైర్మన్గా అని మినీ రవి నాయుడు పేరును ప్రకటించారు. ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్గా భక్తుల తాతయ్య బాబుకు అవకాశం ఇచ్చారు. ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం ట్రై కార్ చైర్మన్ గా బరగం శ్రీనివాసులను నియమించారు. ఏపీ మారి టైం బోర్డు చైర్మన్ గా దామర్ల సత్యను నియమించారు. సీడాప్ చైర్మన్గా దీపక్ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా బిజెపి నేత లంక దినకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కరోతు బంగారు రాజు నియమితులయ్యారు. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డి కి అవకాశం ఇచ్చారు. ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా మంతెన రామరాజు నియమితులయ్యారు.

* కార్పొరేషన్ చైర్మన్ పదవులు
ఏపీ పద్మశాలి సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నందం అబద్దయ్యను నియమించారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ కి అవకాశం ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకల్ల నారాయణ,వైస్ చైర్మన్ గా మునిరత్నం నియమితులయ్యారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు నియమిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

* మూడు పార్టీలకు కేటాయింపు
ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్ పర్సన్ గా పీతల సుజాత పేరు ప్రకటించారు. ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన కు చెందిన తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమించారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన నేత తోట సుధీర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వజ్జా బాబూరావుకు చాన్స్ దక్కింది. ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఇడ్కో చైర్మన్గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ ను నియమించారు. మొత్తానికైతే మూడు పార్టీలకు సమప్రధాన్యమిచ్చారు. మెజారిటీ పదవులు టిడిపి దక్కించుకుంది. జనసేన సైతం కీలక పదవులు పొందింది. ఆ రెండు పార్టీలతో పోల్చితే బిజెపికి అత్యల్పంగా లభించాయి.