Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు కొనసాగించారు ఆదేశ పాలకులు. కానీ 2024లో జరిగిన తిరుగుబాటు, షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత కొలువుదీరినిన మహ్మద్ యూనస్ ప్రభుత్వం 18 నెలల్లో దేశాన్ని ఇస్లామిక్గా మార్చే ప్రయత్నం చేసింది. భారత్పై విద్వేశం వెల్లగక్కింది. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి. తారీఖ్ రహ్మాన్ ప్రభుత్వం భారత్తో సంబంధాలు మెరుగుపర్చే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇదే సమయంలో రాజకీయ, సైనిక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా సెక్యులర్ స్వభావంతో నిలబడిన బంగ్లాదేశ్ ఆర్మీ నెమ్మదిగా మతపరమైన ప్రభావాలకు లోనవుతోంది.
సెక్యులర్ సైన్యం నుంచి ఇస్లామిక్వైపు..
1971లో స్వాతంత్య్రం సాధించిన తర్వాత బంగ్లాదేశ్ సైన్యం సాధారణంగా సెక్యులర్ శక్తిగా పనిచేస్తూ వచ్చింది. ఏ పాలకులు ఉన్నా సైన్యం మతపరమైన భావాలను ప్రోత్సహించకుండా బ్యాలెన్సింగ్ ఫోర్స్గా ఉండే ప్రయత్నం చేసింది. అయితే ఇటీవలి కాలంలో ఈ సమతుల్యత దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర పాలనలో దేశాన్ని మరింత ఇస్లామిక్ దిశగా తీసుకెళ్లాలన్న ప్రయత్నాలు జరిగినప్పటికీ సైన్యం ప్రభావితం కాలేదు. అయితే తాజాగా ఆర్మీ చీఫ్ వకార్–ఉజ్–జమాన్ వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మార్పులు చూపుతున్నారు. గతంలో క్లీన్ షేవ్తో ఉండే ఆయన ఇప్పుడు గడ్డం పెంచడం, సైన్యంలోని కొన్ని యూనిట్లకు ఇస్లామిక్ చరిత్రలోని ఖలీఫాల పేర్లు పెట్టడం వంటి చర్యలు గమనార్హం. ఇవి సైన్యంలో మతపరమైన విలువల ప్రాధాన్యం పెరుగుతోందన్న అనుమానాలను బలపరుస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రభావం..
పాకిస్తాన్ సైన్యంలో జియా–ఉల్–హక్ కాలం నుంచి ఖురాన్ ఆధారిత యుద్ధ భావనలు, జిహాద్ అంశాలపై శిక్షణ ఇవ్వడం సాధారణమైంది. ఇటీవల బంగ్లాదేశ్ సైన్యం పాకిస్తాన్తో సన్నిహితంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పాకిస్తాన్తో స్నేహం ఎంత ప్రమాదకరమో చరిత్ర చెబుతుంది. 1973లో అలీన దేశాల సమావేశంలో ఫిడెల్ కాస్ట్రో షేక్ ముజిబుర్ రెహమాన్ను హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వారిని కీలక పదవుల్లో ఉంచవద్దని సూచించారు. అయినా ఆ సలహా పట్టించుకోకపోవడంతో 1975లో ముజిబ్ హత్య, ఆ తర్వాత దేశం ఇస్లామిక్ రిపబ్లిక్గా మారే దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు సైన్యంలో మతపరమైన ఆలోచనలు పెరిగితే గత చరిత్ర పునరావతం కావచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్పై ప్రభావం..
బంగ్లాదేశ్లో సైన్యం ఇస్లామైజేషన్ దిశగా వెళ్తే సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉంది. మణిపూర్, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత, భద్రత ప్రభావితం కావచ్చు. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు దీన్ని నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ, సైనిక స్థాయి మార్పులపై నిఘా పెట్టడం అత్యవసరం.
భారత్ తన సరిహద్దు భద్రతను బలోపేతం చేసుకుంటూ, బంగ్లాదేశ్ అంతర్గత పరిణామాలను నిశితంగా అధ్యయనం చేయాలి. సైన్యం సెక్యులర్ స్వభావాన్ని కాపాడుకోవడం బంగ్లాదేశ్ స్వయంగా, ప్రాంతీయ స్థిరత్వానికి కూడా మేలు చేస్తుంది. గత పాఠాలను గుర్తుంచుకుని, ప్రస్తుత ధోరణులను నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది.





