Britain Blood Scandal: స్కాం.. ఈ పేరు వినగానే డబ్బుల కోసం చేసే అక్రమ దందా అని అర్థమవుతుంది. అధికారంలో ఉన్నవారు, అధికారులు ఇలా స్కాంలు చేస్తుంటారు. స్కాంలతో వ్యవస్థలకు నష్టం జరుగుతుంది. కానీ, ఈ స్కాంతో ప్రజలు ప్రాణాలు కోల్పయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3 వేల మందిని ఈ స్కాం పొట్టన పెట్టుకుంది. ఇంతకీ ఈ స్కాం ఏంటి.. ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలుసుకుందాం.
బ్రిటన్లో బ్లడ్ స్కాం..
ఇప్పటి వరకు మనం చాలా స్కాంల గురించి వినే ఉంటా. కానీ, ఇంగ్లండ్లో జరిగిన బ్లడ్ స్కాంలో పైసలతోపాటు మనుషుల ప్రాణాలతోనూ చెలగాటం ఆడారు. 1970లో రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని హిమోఫిలియా బాధితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్లాస్మా చికిత్స ప్రారంభించింది. ఈ చికిత్సలో భాగంగా ఫ్యాక్టర్ 8 పేరుతో ల్యాబ్లో తయారు చేసిన రక్తాన్ని బాధితులకు ఎక్కించాల్సి ఉంటుంది. చికిత్స అందుబాటులోకి వచ్చాకా దీనికి మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ల్యాబ్లో తయారు చేసే ఫ్యాక్టర్ 8 కోసం ఇతర దేశాల నుంచి రక్తాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
డబ్ల్యూహెచ్వో వారించినా..
అయితే ఇతర దేశాల నుంచి రక్తం, ప్లాస్మా ఏ దేశం కూడా దిగుమతి చేసుకోవద్దని 1953లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ఇలా దిగుమతి చేసుకున్న బ్లడ్తో అనేక దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయని, వ్యాధులు సోకుతాయని వెల్లడిచింది. అయితే డబ్ల్యూహెచ్వో నిబంధనలను బ్రిటన్ పట్టించుకోలేదు. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ అమెరికా నుంచి భారీగా రక్తం దిగుమతి చేసుకుంది. వేలాది మంది బాధితులకు ఈ రక్తాన్ని ఎక్కించారు.
బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్..
ఇలా దిగుమతి చేసుకున్న రక్తాన్ని ఎక్కించిన చాలా మందితో కొన్ని రోజులకే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం మొదలైంది. ఆలస్యంగా మేల్కొన్న బ్రిటన్ వైద్యాధికారులు దేశవ్యాప్తంగా టెస్టింగ్ ప్రారంభించారు. కానీ అప్పటికే ఫ్యాక్టర్ 8 కారణంగా 30 వేల మందికిపైగా హెచ్ఐవీ, హెపటైటిస్ సోనికట్టు నిర్ధారణ అయింది. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్ఫెక్షన్కు గురైనవారిలో అనేక మంది చనిపోతున్నట్లు గుర్తించారు. ఇలా కొన్నేళ్లలోనే 3 వేల మంది బాధితులు చనిపోయారు.
బాధితుల ఆందోళన..
ఫ్యాక్టర్ 8తో చనిపోయిన, దీర్ఘకాలిక వ్యాధులు హెచ్ఐవీ, హెపటైటిస్ బారిన పడిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని బాధితులు బంధువులు 1980 నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో 2017లో ప్రధాని థెరిస్సా మే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో 5 వేల మంది బాధితులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. నివేదిక రూపొందించింది. ఇందులో విస్తుపోయే విషయాలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రక్తం ఎక్కించకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దిగుమతి చేసుకున్న రక్తంలో క్రిమిలన్స్, డ్రగ్ ఎడిక్ట్స్, హెచ్ఐవీ బాధితులు ఇచ్చిన బ్లడ్ కూడా ఉందని గుర్తించారు. రక్తం కలుషితం అవుతుందని తెలిసినా 1986 వరకు హైరిస్క్ గ్రూప్స్ నుంచి రక్తం తీసుకున్నారు. 1970 వరకు ఎలాంటి టెస్టులు చేయలేదు. 1982లో హెచ్ఐబీ బయటపడినా దానిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1985లో హెచ్ఐవీని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ మొదలు పెట్టారు. ప్రతీ దశలో నిజాలను దాచే ప్రయత్నం చేశారు. పత్రాలను కూడా ధ్వంసం చేశారు. రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుందని తెలిసినా రక్తాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇలా అనేక అంశాలతో 2,500 పేజీల నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందించింది. బాధితులకు పరిహారం చెల్లించే విషయంపై సూచనలు చేసింది.
క్షమాపణ కోరిన ప్రధాని..
నివేదిక తర్వాత ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పారు. బ్రిటన్ చరిత్రలో సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంతోపాటు 1970 నుంచి పాలించిన అన్ని ప్రభుత్వాల తరఫున క్షమాపణ కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు.