Coimbatore: ఓ భారీ ఏనుగుల గుంపు.. వేగంగా దూసుకు వస్తున్న రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్

అది నిర్మానుష్యమైన ప్రాంతం. వెలుతురు ఏమాత్రం లేదు. పైగా చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ దశలో ఘీంకారాలు చేసుకుంటూ ఒక ఏనుగుల మంద అటు వైపు వచ్చింది.. అంతే వేగంతో ఓ రైలు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తున్నది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Written By: Anabothula Bhaskar, Updated On : October 19, 2024 10:44 am

Coimbatore

Follow us on

Coimbatore: ఆ రైలు వేగంగా పరుగులు పెడుతోంది. ఆ ఏనుగులు రైలు పట్టాల మధ్య నుంచి నడుస్తూ అవతల వైపుకు వెళుతున్నాయి. రెండింటి మధ్య క్షణకాలం మాత్రమే దూరం. కానీ అప్పుడే అద్భుతం జరిగింది. రైలు నడుపుతున్న లోకో పైలట్ సమయస్ఫూర్తి ప్రదర్శించాడు. ఫలితంగా దాదాపు 60 ఏనుగుల గుంపును రక్షించాడు. అత్యవసరంగా బ్రేకులు వేయడంతో రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. ఆ ఏనుగులు నిదానంగా ఆ మార్గాన్ని దాటి అవుతలి వైపుకు వెళ్లిపోయాయి. చదువుతుంటే ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తోంది కదూ.. అత్యవసరమైన బ్రేక్ వేసిన ఆ లోకో పైలట్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోను సీనియర్ ఐఏఎస్ అధికారి సుప్రియ సాహూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ ఘటన ఎక్కడ చోటుచేసుకుంది? లోకో పైలట్ ఎలాంటి చాకచక్యాన్ని ప్రదర్శించారు? దానివల్ల ఏనుగుల మంద ఎలా బతికి బట్ట కట్టింది? సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అనే విషయాలను సుప్రియ తన సుదీర్ఘ ట్వీట్ లో ప్రస్తావించారు.

సాంకేతిక పరిజ్ఞానం వల్ల..

సాంకేతిక పరిజ్ఞానం వల్లే రైలును అప్పటికప్పుడు అత్యవసర బ్రేక్ వేసి లోకో పైలట్ నిలుపుదల చేశారని సుప్రియ వ్యాఖ్యానించారు. “ఇది అపురూపమైన దృశ్యం.. కామరూప్ ఎక్స్ ప్రెస్(15959) ను లోకో పైలట్ దాస్, అసిస్టెంట్ లోకో పైలట్ ఉమేష్ కుమార్ నడుపుతున్నారు. అక్టోబర్ 16న హబాయ్ పూర్, లాంసా కాంగ్ మధ్యకు చేరుకోగానే.. 60 ఏనుగుల గుంపు వారికి కనిపించింది. ఆ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటుతోంది. దీంతో ఉమేష్ కుమార్, దాస్ అప్పటికప్పుడు అత్యవసరమైన బ్రేక్ వేసి రైలును ఆపారు. వారు బ్రేక్ వేయడం వల్ల రైలు అక్కడికక్కడే ఆగింది.. ట్రాక్ ను సమగ్రంగా కవర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందిన డిటెక్షన్ సిస్టం ద్వారా లోకో పైలెట్లు రైలును ఆపారు. దీనివల్ల ఏనుగులు ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ సంఘటన రైల్వే వ్యవస్థలో సాంకేతికత అవసరాన్ని నొక్కి చెబుతోంది. కోయంబత్తూర్ లోని మధుక్కరై ప్రాంతంలో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థను రూపొందించాం. దాంతోపాటు థర్మల్ కెమెరాలు ఏర్పాటు చేశాం. దానివల్ల రియల్ టైం అలర్ట్ ఎప్పటికప్పుడు అందుతోంది.. దీనివల్ల 24/7 పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఫలితంగా రైళ్లు ఏనుగులను ఢీకొట్టడాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది.. ప్రమాదకరమైన ట్రాక్ లలో జంతువులకు జరిగే హానిని తగ్గించడానికి వీలుపడుతోంది. ఇలాంటి సాంకేతికత వల్ల వన్యప్రాణుల మరణాలు తగ్గుతాయి. జీవవైవిధ్యం కూడా మెరుగవుతుంది. మనుషులు, జంతువులు, అడవుల మధ్య సహజీవనం కొనసాగుతుందని” సుప్రియ వ్యాఖ్యానించారు. కాగా, ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.