Anantapur: పరీక్ష పేపర్ లో విద్యార్థి రాసింది చూసి మెంటలెక్కిపోయిన ఉపాధ్యాయుడు.. ఇంతకీ ఏం రాశాడంటే?

అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఆ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల 10 పరీక్షలు పూర్తి కావడంతో అతనికి స్పాట్ (జవాబు పత్రాల మూల్యాంకనం) డ్యూటీ పడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 8, 2024 2:53 pm

Anantapur

Follow us on

Anantapur: వార్షిక పరీక్షలంటే చాలు విద్యార్థుల్లో ఎనలేని భయం ఉంటుంది. పరీక్షలు బాగా రాయాలి. చేతిరాత బాగుండాలి.. మంచి మార్కులు సాధించాలనే తపన విద్యార్థుల్లో ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులు మాత్రం విభిన్నంగా ఉంటారు. సరిగ్గా చదవరు. పాఠశాలకు వచ్చినా.. మాస్టారు చెప్పే పాఠాలను సరిగ్గా వినిపించుకోరు. ఇంకా అలాంటివారు పరీక్షల్లో ఏం రాస్తారు? అలాంటి కోవకు చెందిన ఓ విద్యార్థి వార్షిక పరీక్షల్లో లెక్చరర్ ను తన రాతలతో బెదిరించాడు. దెబ్బకు అదిరిపోయిన ఆ ఉపాధ్యాయుడు తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే

అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఆ వీడియో పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల 10 పరీక్షలు పూర్తి కావడంతో అతనికి స్పాట్ (జవాబు పత్రాల మూల్యాంకనం) డ్యూటీ పడింది.. అతను తన డ్యూటీలో ఉండగా.. ఓ విద్యార్థి జవాబు పత్రాన్ని పరిశీలించాడు.. అందులో ఉన్న సమాధానాలు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. 28 పేజీల జవాబు పత్రం లో ఆ విద్యార్థి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కు కూడా సమాధానం రాయలేదు. 28 పేజీల్లో 25 పేజీలను ఖాళీగా ఉంచాడు. ఇంతకీ అందులో ” నీకు దమ్ముంటే నన్ను పాస్ చేయ్ ” అని రాశాడు. అంతటితోనే ముగించాడు.

షాక్ కు గురయ్యాడు

ఆ జవాబు పత్రాన్ని చూసిన ఆ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ సమాధానానికి అతడికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే బయటికి వచ్చి ఒక వీడియో తీశాడు. “అన్ని జవాబు పత్రాలు చూసిన నేను.. ఆ విద్యార్థికి సంబంధించిన ఆన్సర్ షీట్ చూడడంతో తలనొప్పి మొదలైంది. 28 పేజీలు ఉన్న ఆన్సర్ షీట్ మొత్తం ఖాళీగా ఉంది. ప్రారంభ పేజీని వదిలిపెట్టి రెండు, మూడు, నాలుగు పేజీల్లో “నీకు దమ్ముంటే నన్ను పాస్ చెయ్” అని నన్ను బెదిరించినంత పని చేశాడు.. ఆ జవాబు చూసి ఒక్కసారిగా నాకు తల తిరిగిపోయింది.. ఈ తలనొప్పి తగ్గించుకోవాలంటే అర్జెంటుగా నేను జ్యూస్ తాగాలి. ఆ జ్యూస్ తాగి వచ్చి.. మిగతా జవాబు పత్రాలు ఎలా ఉన్నాయో మీకు చెబుతాను.. ఆ విషయాలను మరో వీడియోలో పంచుకుంటానని” ఆ ఉపాధ్యాయుడు తన బాధను వెళ్ళగక్కాడు.

వైరల్ గా మారాయి

అనంతపురం జిల్లాలోని మూల్యాంకనం కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. ఆ ఉపాధ్యాయుడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఇది లక్షల్లో వ్యూస్ నమోదు చేసింది.. ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి తలుచుకుని చాలామంది లోలోపల నవ్వుకుంటున్నారు. మరి కొంతమంది బాగా రాశాడు కదూ! అంటూ సెటైర్లు వేస్తున్నారు. పరీక్ష ఇలా కూడా రాస్తారా? అంటూ కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా కాలేజీకి వెళ్లి, అధ్యాపకులు చెప్పే పాఠాలు విని.. సక్రమంగా పరీక్ష రాస్తే ఇలాంటి తిప్పలు తప్పేవి కదా? అని హితవు పలుకుతున్నారు. అదే సమయంలో ఆ ఉపాధ్యాయుడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.