ATM Center: అందరినీ సీజ్ చేసే బ్యాంకు కే ఝలక్ ఇచ్చాడు.. అద్దె కట్టలేదని తాళం వేశాడు..

సొంత భవనాలు నిర్మించుకోవడం కష్టంగా మారిన ఈ రోజుల్లో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇక వ్యాపారాలు అయితే చాలా వరకు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తారు. ఇందుకోసం అగ్రిమెంటు కూడా చేసుకుంటారు. అడ్వాన్సులు కూడా భారీగానే చెల్లించాల్సి ఉంటుంది.

Written By: Raj Shekar, Updated On : August 27, 2024 8:38 am

ATM Center

Follow us on

ATM Center: అద్దె అంటే.. అడ్వాన్స్‌.. అగ్రిమెంటు తప్పనిసరి. ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు బిచానా ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. దీంతో యజమానులు అడ్వాన్‌ తీసుకోవడమే కాకుండా నెలనెలా అద్దె కూడా ఠంచన్‌గా వసూలు చేస్తున్నారు. అద్దె చెల్లించకుంటే.. అగ్రిమెంట్‌లో రాసుకున్న మేరకు చర్చలకు సిద్ధమవుతున్నారు. ఇక బ్యాంకులకు భవనాలు అద్దెకు ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలా మంది అనకుంటారు. నెలనెలా అద్దె కూడా సరిగ్గా అందుతుందని భావిస్తారు. దీంతో చాలా మంది తమ భవనాలను అగ్రిమెంటు మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు అద్దెకిస్తారు. ఆమేరకు నెలనెలా అద్దె వసూలు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఓ బ్యాంకు అద్దె చెల్లించకపోవడంతో యజమాని ఏటీఎంకు తాళం వేశారు. యజమాని చర్యతో బ్యాంకుతోపాటు, ఆ బ్యాంకు కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎం దగ్గర బోర్డు కూడా ఏర్పాటు చేశాడు. అద్దె చెల్లించని కారణంగా ఏటీఎంకు తాళం వేసినట్లు పేర్కొన్నాడు. ఈ బోర్డు చూసి ఏటీఎం వద్దకు వచ్చిన కస్టమర్లు షాక్‌ అవుతున్నారు.

అప్పుల వసూలులో కచ్చితంగా..
సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు వినియోగదారులకు రుణాలు ఇస్తుంటాఇ. వాటిని ఈఎంఐ రూపంలో నెలనెల వసూలు చేస్తుంటాయి. ఇందుకు వడ్డీ కూడా తీసుకుంటాయి. ఒక్క నెల వాయిదా చెల్లించకుంటే. మరుసటి నెలలో వడ్డీకి వడ్డీ వేసి వసూలు చేస్తాయి. ఇక క్రెడిట్‌ కార్డుల విషయంలో అయితే ఒక్క రోజు ఆలస్యంగా చెల్లించినా ఫైన్‌ కట్టాల్సిందే. కానీ కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బ్యాంకు మాత్రం రుణాల వసూలుపై చూపిన శ్రద్ధ బ్యాంకు భవనం, ఏటీఎం గది అద్దె చెల్లించడంపై చూపడం లేదు. దీంతో అద్దె కట్టడం లేదంటూ సాక్షాత్తు ఒక ప్రభుత్వరంగ బ్యాంకు శాఖ ఏటీఎంకే యజమాని తాళం వేసి నోటీసులు బ్యాంకులు రుణ గ్రహీతల ఇంటికి అంటించినట్లుగా యజమాని బోర్డు తగిలించాడు. ఇది చూసి కష్టమర్లు షాక్‌ అవుతున్నారు. ఇలా కూడా చేస్తారా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. తమ నుంచి అన్నింటికీ చార్జీలు వసూలు చేసే బ్యాంకు.. ఇలా అద్దె చెల్లించకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఇదిలా ఉంటే.. ఏటీఎంకు యజమాని తాళం వేసిన ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. లోక్‌ చెల్లించడం ఆలస్యమైనా.. క్రెడిట్‌ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా వడ్డీతో సహా వసూలు చేసే బ్యాంకు ఇలా అద్దె చెల్లించలేని స్థితికి చేరిందా అని కామెంట్లు పెడుతున్నారు. మా నుంచి వసూలు చేసే చార్జీలు, వడ్డీలు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులకు ఒక రూలు.. అద్దె చెల్లించడానికి ఒక రూలా.. అని ఇంకొందరు నిలదీస్తున్నారు. మొత్తంగా కరీంనగర్‌లో ఏటీఎంకు తాళం వేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.