JanaSena – 99Tv Channel: తెలుగు నాట జనసేనాని పవన్ కళ్యాణ్ కు మీడియా సపోర్టు అంతంతమాత్రమే. పేరుమోసిన మీడియా సంస్థలు ఇప్పటికే పెద్దల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. రెండు కులాల కోసం ఆరాటపడుతున్నాయి. రెండు పార్టీల పల్లకి మోస్తున్నాయి. ఆ మీడియాలో పవన్ కి అవసరానికి తగ్గట్టు చోటు కల్పిస్తుంటాయి. తమకు అనుకూలంగా ఉంటే ఒకలా.. ప్రతికూలంగా ఉంటే మరోలా చూపిస్తాయి. ప్రాధాన్యతను తగ్గిస్తాయి. జనసేన ఆవిర్భావం నుంచి జరుగుతున్నది ఇదే. అటు జగన్ అనుకూల మీడియా, ఇటు చంద్రబాబు అనుకూల మీడియాగా రెండు వర్గాలుగా విడిపోయింది. ఆ మీడియాల్లో వారి వారి కార్యక్రమాలకే పతాక శీర్షికన వార్తలు, కథనాలు వస్తాయి. 2018 వరకూ కూడా జనసేనకు సొంతంగా ఎలక్ట్రానిక్ మీడియాలో సపోర్టు లేకుండా ఉండేది.

ఎలక్ట్రానిక్ మీడియా గురించి చెప్పనక్లర్లేదు. రేటింగ్స్ కోసం పవన్ ను ఎంతలా వాడుకోవాలో అంతగా వాడుకుంటారు. చివరకు మాత్రం తాము పల్లకి మోసే పార్టీలకు మైలేజ్ వచ్చేలా మార్చేస్తారు. అయితే పవన్ పార్టీ జనసేనకు గత కొన్నేళ్లుగా సపోర్టుగా నిలిచిన ఏకైక మీడియా చానల్99 టీవీ. కానీ ఇన్నాళ్లూ లేనిది.. రాత్రికి రాత్రే అనూహ్య నిర్ణయం తీసుకుంది. పవన్ పేరెత్తకుండా రోజు గడవదన్న రేంజ్ లో ఉన్న ఆ చానల్ సడెన్ గా స్వరం మార్చింది. పవన్ గురించి తెలియదన్నట్టు వ్యవహరిస్తోంది. దీని వెనుక కథ ఏంటి? అని అందరూ చర్చించుకుంటున్నారు.
99 టీవీని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా 20 జూలై 2014 న హైదరాబాద్లో స్థాపించారు. తరువాత 99TV పూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) కొనుగోలు చేసి కమ్యూనిస్టు సిద్ధాంతాలతో నడిచింది. ఇది తరువాత నష్టాల్లో కొనసాగింది. వీక్షకులను సంపాదించుకోలేకపోయింది. ఈ ఛానల్ ను న్యూ వేవ్స్ డిజిటల్ మీడియా ద్వారా 11 జూలై 2018న చేపట్టారు.ధాన కార్యాలయంగా ఉన్న హైదరాబాద్ కొండాపూర్ లో న్యూ వేవ్స్ మీడియా ప్రధాన కార్యాలయం నుండి ప్రసారం ప్రారంభమైంది. ఏపీ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన తోటా చంద్రశేఖర్ నేతృత్వంలోని న్యూ వేవ్స్ మీడియా యాజమాన్యంలో పున: ప్రారంభమైంది. తోట చంద్రశేఖర్ జనసేనలో చేరడంతో పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ఈ ఛానల్ జోరందుకుంది. అది కూడా పవన్ కళ్యాణ్ కు కవరేజీ ఇస్తుండడంతో ప్రత్యేక వీక్షకులను సొంతం చేసుకుంది. అయితే ఇది జనసేన అధికార మీడియా చానల్ అని అందరూ భావిస్తారు. గత కొన్నేళ్లుగా ఆ చానల్ వ్యవహారం కూడా అలానే ఉంది. కానీ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఇప్పుడు పార్టీ మారడంతో జనసేనకు కూడా ఈ ఛానెల్ దూరమైంది. .
తోట చంద్రశేఖర్మ హారాష్ట్ర కేడర్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈ ఐఏఎస్ అధికారి పదవీ విరమణ తరువాత తన గాలి రాజకీయాల వైపు సోకింది. కాపు నేత కావడంతో పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీగా 2009లో హేమాహేమీలతో తలపడ్డారు. కానీ ఓటమే ఎదురైంది. అటు తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో కర్చిఫ్ వేశారు. 2014లొ నరసాపురం నుంచి పోటీచేసి చేతులు కాల్చుకున్నారు. అయితే చేతిలో మీడియా ఉంటే గుర్తింపు ఉంటుందన్న భావనతో 99 టీవీ చానల్ ను 2018లో కొనుగోలు చేశాడు. 2019 ఎన్నికల్లో పవన్ చెంతకు చేరారు. జనసేనలో చేరాడు. 99 టీవీని జనసేనకు వాయిస్ గా మార్చారు. ఆ తర్వాత జనసేన నుంచి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు కేసీఆర్ ఆఫర్ తో బీఆర్ఎస్ లో చేరారు.

అయితే ఇలా బీఆర్ఎస్ ఆఫర్ వచ్చిందో లేదో… తన 99 టీవీ చానల్ స్ట్రాటజీనే మార్చేశారు. అప్పటివరకూ పవన్ తారకమంత్రం పఠించిన సదరు చానల్ పై ఇప్పుడు కేసీఆర్ మెరిసిపోతున్నారు. దాని పక్కన తోట చంద్రశేఖరం ఫొటో పెట్టి వండి వార్చుతున్న కథనాలు చూసి జనసైనికులు కూడా అదే స్థాయిలో రియాక్టు అవుతున్నారు. వామ్మో ఎంత మోసమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నటి వరకూ జనసేన పార్టీ కార్యక్రమాల ఫాలోప్ గురించి జన సైనికులు సదరు 99 టీవీ చానల్ నే చూసేవారు. ఉన్నట్టుండి చానల్ ప్లేట్ ఫిరాయించడంతో షాక్ కి గురయ్యారు. కేవలం వ్యూయర్ షిప్ కోసం జనసేన, పవన్ ను చూపించి వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత టీవీ చానల్ జాబితాలో 99 టీవీని కూడా చేర్చుతున్నారు. అయితే ఇప్పుడు జనసేనకు వచ్చే ప్రమాదమేదీ లేదు. తెలుగనాట 99 టీవీకి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. అటు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ఎంత మీదకు లేపినా కుదిరే పనికాదని కూడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.