Neuralink : కంప్యూటర్‌, మనిషి మెదడు కలిస్తే.. ఎలన్ మస్క్‌ ఇప్పుడు అదే చేయబోతున్నాడు

కేవలం ఊహలతోనే కంప్యూటర్‌ను నియంత్రించడం, ఎటువంటి సమాచారమైనా లిప్తపాటులో పొందగలగడం వంటి వాటితో మనిషి మేధస్సుకు ఉన్న పూర్తి సామర్ధ్యం వెల్లడవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : May 28, 2023 9:49 am
Follow us on

Neuralink : చెట్టు మీద ఉసిరిని, చేలోని మిరపను, సముద్రంలో ఉప్పును కలిపితే ఏమవుతుంది? అది జాడిలోని ఉసరి పచ్చడి అవుతుంది. అదే ఎలాకా్ట్రన్ల కలబోతతో రూపొందిన కంప్యూటర్‌, న్యూరాన్లతో నిర్మితమైన మనిషి మెదడును కలిపితే ఏమవుతుంది? అదేంటి అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అది ఇప్పుడు త్వరలో సాధ్యం కాబోతోంది. ఆ అసాధ్యాన్ని టెస్లా కో-ఫౌండర్‌, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలన్‌మస్క్‌ సాధ్యం చెయబోతున్నారు. ఆ మధ్య ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో హీరో మెదడులో చిప్‌లను అమర్చినట్టు మనిషి మెదడును, కంప్యూటర్‌తో అనుసంధానించే ప్రక్రియ వేగం పుంజుకోబోతోంది.
ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు
వాస్తవానికి మెదడును, కంప్యూటర్‌ను సరాసరి అనుసంధానించే తమ సాంకేతికత ప్రయాణం ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. అయితే ఇది కీలక మైలురాయిని చేరుకుందని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ సంస్థ తాజాగా ప్రకటించింది. మానవ మెదడులో చిప్‌ అమర్చి పరిశోధనలు చేసేందుకు అమెరికా ఆహార-ఔషధ నియంత్రణ సంస్థ(ఎ్‌ఫడీఏ) ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ‘న్యూరాలింక్‌ సాంకేతికతలో ఇది చాలా కీలకమైన అడుగు. మా అధ్యయనం మొదలుపెట్టేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మెదడులో అమర్చే చిప్‌ సాయంతో ఆ మనిషి కంప్యూటర్‌తో సరాసరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలరు. ఇప్పటికే కోతులపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. అవి వాటి మెదడుతో వీడియోగేమ్స్‌ ఆడాయి. తెరపై కర్సర్‌ను కదల్చగలిగాయి. మనుషులపైనా విజయవంతమైతే ఈ సాంకేతికతతో చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా దృష్టిని కోల్పోయినవారు, దివ్యాంగులు, కదలలేని పరిస్థితిలో ఉన్నవారికి ఇది ఒక వరమని చెప్పవచ్చు. కేవలం వైద్యపరమైన ఉపయోగాలు మాత్రమే కాక, మున్ముందు మరింత విస్తృతమయ్యే కృత్రిమ మేధ(ఏఐ)ను మనిషి ఎదుర్కొనేందుకు, మానవ మేథస్సును పెంపొందించేందుకు ఇది అవసరం’’ అని న్యూరాలింక్‌ స్పష్టం చేసింది.
అనుమతులు ఇచ్చినప్పటికీ
అనుమతులు ఇచ్చినప్పటికీ ఎఫ్‌డీఏ ఈ ప్రయోగాలను నిశితంగా పరిశీలిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిప్‌లో వాడే లిథియం బ్యాటరీ భద్రత, మెదడు ఆరోగ్యానికి దాని వల్ల కలిగే ప్రమాదంవంటి వాటిపై నియంత్రణ సంస్థ గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేసింది. అమెరికా రవాణా శాఖ న్యూరాలింక్‌ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఎటువంటి భద్రత చర్యలు లేకుండా ప్రమాదకర సూక్ష్మక్రిములను సంస్థ తరలించిందన్న ఆరోపణలపై రవాణా శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మానవ మెదడు విద్యుత్‌ సంకేతాల ఆధారంగా శరీరాన్ని నియంత్రిస్తుంది.
మెదడుకు, డిజిటల్‌ ప్రపంచానికి మధ్య వారధి
 అదే విధంగా న్యూరాలింక్‌ చిప్‌ సైతం మెదడుకు, డిజిటల్‌ ప్రపంచానికి మధ్య వారధిలా ఉపకరిస్తుంది. దీనిలో ఉండే చిన్న చిన్న ఎలకా్ట్రడ్‌లు మెదడు చేసే విద్యుత్‌ సంకేతాలను గుర్తించి కంప్యూటర్‌కు పంపిస్థాయి. ఈ సాంకేతికతతో మనిషికి ఉన్న పరిధులన్నీ చెరిగిపోతాయని న్యూరాలింక్‌ అధినేత మస్క్‌ చెబుతున్నారు. కేవలం ఊహలతోనే కంప్యూటర్‌ను నియంత్రించడం, ఎటువంటి సమాచారమైనా లిప్తపాటులో పొందగలగడం వంటి వాటితో మనిషి మేధస్సుకు ఉన్న పూర్తి సామర్ధ్యం వెల్లడవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.