Viral News: బైక్ విన్యాసాలతో నరకం చూపిస్తున్నారు.. విసుగు చెందిన ప్రజలు ఆకతాయిలకు ఎలా బుద్ధి చెప్పారంటే..

బిజీగా ఉండే రోడ్లపై ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు. వారి స్టంట్ లు అత్యంత భయంకరంగా ఉన్నాయి. దీంతో విసుగు చెందిన ప్రజలు వారికి సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 19, 2024 9:09 am

Viral News

Follow us on

Viral News: ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటివారికి విసుగు వస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు. కానీ దాని పర్యవసనాలను కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ విన్యాసాలు ఎదుటి వ్యక్తులను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్న ఓ వీడియో ప్రకారం.. ఓ ఫ్లై ఓవర్ పై కొంతమంది యువకులు దారుణమైన స్టంట్ లు చేస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. వారికి సరైన స్థాయిలో గుణపాఠం నేర్పాలని భావించారు. ఇదే క్రమంలో ఆ ఫ్లై ఓవర్ నుంచి వారు నడుపుతున్న వాహనాలను ఒకసారి గా కింద పడేశారు. దీంతో ఆ వాహనాలు ధ్వంసమయ్యాయి. దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా కొనసాగుతున్న బెంగళూరు లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బెంగళూరులోని నెలమంగల ప్రాంతంలో ఫ్లై ఓవర్ ఉంది. దీని మీదుగా భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బెంగళూరు సిటీకి శివారు ప్రాంతమైన ఈ ఫ్లైఓవర్ పై కొంతమంది ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఆ విన్యాసాల వల్ల చుట్టుపక్కల ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రద్దీ రోడ్లు కావడంతో ప్రయాణికులు కూడా నరకం చూస్తున్నారు. దీంతో ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని భావించిన స్థానికులు.. వారు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను ఫ్లై ఓవర్ నుంచి కిందకు పడేశారు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అలా కింద పడేసిన ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ ఘటన జరుగుతున్నప్పుడు స్థానికులు కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం బెంగళూరు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు చర్యలు తీసుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా 36 మందిపై కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించారు. ఆ ద్వి చక్ర వాహనాలను కూడా వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రద్దీగా ఉండే రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అయితే ఈ విన్యాసాలు చేసిన యువకులు మొత్తం స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను చదువుతున్నట్టు తెలిసింది.