Tamil Nadu: అర్ధరాత్రి పూట ఆడది ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ఆనాడు గాంధీ మహాత్ముడు సెలవిచ్చాడు.. నిర్భయ ఘటన జరిగిన తర్వాత మనదేశంలో ఆడవాళ్ళ భద్రతకు సంబంధించిన భయాలు మరింతగా పెరిగిపోయాయి. అర్ధరాత్రి కాదు కనీసం పట్టపగలు రోడ్డు వెంట ధైర్యంగా నడిచే పరిస్థితులు కూడా లేవు. ఎక్కడ చూసినా ఏవో దారుణాలు జరుగుతుండడం తల్లిదండ్రులనే అమ్మాయికి సంబంధించిన బంధువుల్ని, స్నేహితులని కలవరపెడుతోంది.. ఎక్కడో దారుణం జరిగిందని వినగానే మన దగ్గర కాదులే, మనకు అలాంటి పరిస్థితి రాదులే అనే ఆలోచనతో చాలామంది ఆడవాళ్లు బయటకు వెళ్తూ ఉంటారు.. ఇలాంటి భరోసాతోనే ఓ అమ్మాయి రోడ్డు పక్కన వెళ్తుండగా.. ఆ దిశగానే ఒక కారు దూసుకు వచ్చింది.. ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే కాదు..ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసినవారు కూడా బెంబేలెత్తిపోయారు. ” సమాజం ఇంతలా మారిపోయింది ఏంటి?” అని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుంటే.
రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా..
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ప్రాంతంలోని రోడ్డు పక్కన ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే ఆ అమ్మాయికి దారుణమైన అనుభవం ఎదురయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వీడియో ప్రకారం ఒక అమ్మాయి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. ఆ రోడ్డుమీదుగా వాహనాల రాకపోకలు సాగుతూ ఉన్నాయి. కానీ ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అప్పుడే అకస్మాత్తుగా ఒక కారు దూసుకు వచ్చింది.. కారు అద్దంలో నుంచి ఓ యువకుడు చెయ్యి బయటకు పెట్టాడు. ఆ అమ్మాయి మెడలో ఉన్న బంగారు గొలుసు పట్టుకున్నాడు. ఆ అమ్మాయి బంగారు గొలుసు కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.. కారు వేగంతో ఉండడంతో ఆమె కింద పడిపోయింది.. అయినప్పటికీ ఆ అమ్మాయి తన మెడలో ఉన్న బంగారు గొలుసును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఆ బంగారు గొలుసు కోసం ఆ కారులో ఉన్న ఆగంతకులు ఆమెను కొన్ని అడుగులు ఈడ్చుకు వెళ్లారు. కానీ వారికి ఆ గొలుసు దక్కలేదు. దీంతో వారు అక్కడి నుంచి అదే వేగంతో ఉడాయించారు.
కారు వెళ్లిపోగానే..
కారు వెళ్లిపోగానే ఆ అమ్మాయి కింద పడ్డదల్లా పైకి లేచి తన చేతికయిన గాయాలను చూసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. చేతుల మీద చర్మం రాసుకుపోవడంతో రక్తం కారడం ప్రారంభమైంది. ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఆ అమ్మాయి అలానే కూర్చుని ఉండిపోయింది. అయితే ఈ సంఘటన అక్కడ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలు రికార్డు అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. “కోయంబత్తూరులో 33 సంవత్సరాల ఇలా ఒంటరిగా రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే చైన్ స్నాచర్లు ఆమె బంగారు గొలుసు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు” అని ఈ వీడియో పోస్ట్ చేసిన న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది.. ఈ సంఘటనకు సంబంధించి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కారు నెంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గొలుసు చోరీ చేసేందుకు యత్నించిన అభిషేక్, శక్తి వేల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.. ఇదే సమయంలో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఒంటిమీద ఖరీదైన నగలు వేసుకోవద్దని సూచించారు. ఇక ఈ వీడియో చూసిన చాలామంది సమాజం ఇలా తయారయ్యిందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇన్నాళ్లు బైక్ ల మీద వచ్చి మాత్రమే దొంగతనం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా కార్లలో వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Coimbatore, Tamil Nadu | In a chain snatching incident, caught on CCTV camera, a 33-year-old woman Kaushalya was seen falling down and briefly being dragged by the accused in a car. The woman managed to save the chain from being snatched. Based on the complaint and CCTV… pic.twitter.com/5PcagaUhvI
— ANI (@ANI) May 16, 2023