TANA Farmer Welfare Program: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తానా (Telugu Association of North America) ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు కోసం” సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. తణుకు పట్టణంలోని వి.కే. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది రైతులకు రూ.25 లక్షల విలువైన పవర్ స్ప్రేయర్లు మరియు తార్పాలిన్లు పంపిణీ చేశారు.
రైతుల వ్యవసాయ పనులను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలు తెలియజేస్తూ రైతులకు అండగా నిలుస్తున్న తానా సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమానికి అప్కాబ్ (APCOB) చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రైతులకు పవర్ స్ప్రేయర్లు, తార్పాలిన్లు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం తానా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించడం ద్వారా రైతుల శ్రమను తగ్గించడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఇది సహాయపడుతుందని అన్నారు.

అలాగే ఇటీవల అమెరికాలో జరిగిన అల్బనీ అగ్ని ప్రమాద సమయంలో తానా టీమ్స్క్వేర్ వెంటనే స్పందించి బాధిత భారతీయ విద్యార్థులకు అందించిన సహాయాన్ని కూడా వారు గుర్తు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు స్వదేశానికి సేవ చేయాలనే తపనతో తానా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ రైతులు దేశానికి అన్నదాతలు అని అన్నారు. రైతు కష్టపడితేనే దేశ ప్రజలకు అన్నం దొరుకుతుందని పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి కొంతైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

రైతులకు అందిస్తున్న పవర్ స్ప్రేయర్లు, తార్పాలిన్లు వారి వ్యవసాయ పనులను సులభతరం చేస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమాజానికి తిరిగి ఇవ్వడం తానా ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్య, ఆరోగ్యం, రైతుల సంక్షేమం వంటి అనేక రంగాల్లో తానా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తణుకు ప్రాంతానికి చెందిన పలువురు స్థానిక నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు పవర్ స్ప్రేయర్లు మరియు తార్పాలిన్లు అందజేయడంతో తానా సేవలను స్థానిక ప్రజలు అభినందించారు. రైతులకు నేరుగా ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని రైతులు ఆనందంతో స్వాగతించారు.
