Middle East War Impact On Food Crisis: కొన్ని దశాబ్దాల క్రితం కమల్ హాసన్ హీరోగా ఆకలి రాజ్యం అనే సినిమా వచ్చింది.. గుర్తుందా.. డిగ్రీ చదివినప్పటికీ.. సరైన ఉద్యోగం లేక కమలహాసన్.. అతడు స్నేహితులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కనీసం తినడానికి తిండి కూడా ఉండదు. ఓ సందర్భంగా కమల్ హాసన్, అతడి స్నేహితులు ఉండే గదికి శ్రీదేవి వస్తుంది. ఆమె ముందు తాము పంచభక్ష పరమాన్నాలు తింటున్నట్టుగా కమలహాసన్, అతడి స్నేహితులను నటిస్తారు. మొదట్లో ఇది నిజమని శ్రీదేవి భావిస్తుంది. అనుమానం వచ్చి చూస్తే.. ఆ గదిలో ఖాళీ గిన్నెలు తప్ప ఏమీ ఉండవు.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
ఆ సన్నివేశం యూట్యూబ్ లేదా టీవీలలో చూస్తే ఇప్పటికి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆకలికి కులం ఉండదు, మతం అంతకంటే ఉండదు. సమయానికి ఆకలిగా ఉన్న కడుపుకు ఇంత ఆహారం పడితే క్షుద్భాద తీరుతుంది. శరీరం సత్తువను పెంచుకొని ముందుకు సాగుతూ ఉంటుంది. అందువల్లే ఈ జీవికైనా సరే ఆహారం అనేది అత్యంత ముఖ్యం. పీల్చేగాలి.. తాగే నీరు తర్వాత ఆహారం అనేది అత్యంత అవసరం…
ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి. అవి మనిషి జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అనేక యుద్ధాలు మనిషి జీవితం మీద అత్యంత తీవ్రంగా ప్రభావం చూపించాయి. గూడు పరంగా.. కూడు పరంగా.. భవిష్యత్తు పరంగా ఎన్నో ప్రతికూల ఫలితాలను మనిషి చవి చూశాడు. అయితే పెద్ద దేశాల యుద్ధకాంక్ష వల్ల.. పెత్తందారి వ్యవస్థను కొనసాగించాలనే తీరు వల్ల యుద్ధాలు వస్తున్నాయి.
ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం మొదట్లో కొద్ది రోజుల వరకు సాగుతుందని అందరూ అనుకున్నారు. అమెరికా దుర్మార్గం.. ఇజ్రాయిల్ మొండితనం.. ఇరాన్ పోరాటం.. వీటివల్ల మధ్య ప్రాచ్యం రావణ కాష్టం లాగా మండుతోంది. ఈ యుద్ధం ఇంకా ఎన్నిరోజులు సాగుతుందో తెలియదు. కాకపోతే ఈ యుద్ధం వల్ల ఎదురవుతున్న ప్రతికూలతలను ప్రపంచం ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎదుర్కొంటున్నది. ఇప్పటికే చాలా వరకు దేశాలలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. అమెరికా లేని పంతానికి పోతోంది. ఇజ్రాయిల్ పట్టు విడవడం లేదు. ఇరాన్ ఏ మాత్రం తగ్గడం లేదు.. ఫలితంగా ప్రపంచం మొత్తం ఒత్తిడి ఎదుర్కొంటున్నది. అయితే ఈ యుద్ధం కేవలం చమురు, గ్యాస్ వరకే ఆగిపోవడం లేదు. అనేక దేశాల ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నాయి. వంట నూనెలు.. ఆహార గింజలు.. ఎండు ఫలాలు.. ఔషధాలు.. ఖనిజాలు.. ముడి పదార్థాలు.. పండ్లు.. చర్మ ఉత్పత్తులు.. ఇలా ప్రతి విభాగము తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దీని ఆధారంగా సాగే పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. సకాలంలో దిగుమతులు, ఎగుమతులు జరగకపోతే ధరల స్థాయి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పటికే వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. కోవిడ్ నాటికంటే ఎక్కువ ధరలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పప్పు దినుసులు.. తిండి గింజల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక బ్రాయిలర్, లేయర్ కోళ్ల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో స్కిన్లెస్ బ్రాయిలర్ చికెన్ ధర కిలోకు 380 వరకు పలుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లే యుద్ధమనేది ఎప్పుడైనా సరే వినాశనాన్ని మాత్రమే కోరుతుంది. దానివల్ల ప్రపంచం మొత్తం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అప్పుడు ఆహారం దొరకదు. ఆకలి తీరదు. సింపుల్ గా చెప్పాలంటే ఆకలి రాజ్యం సినిమా లైవ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇంత యుద్ధం చేసిన తర్వాత.. ఈ స్థాయిలో ఘోరాలకు పాల్పడ్డ తర్వాత.. మనుషులు సాధించింది ఏమైనా ఉందంటే.. అది ఒకరిని ఒకరు చంపుకోవడం మాత్రమే..
