September 17 : తెలంగాణలో అందరి చూపు సెప్టెంబర్ 17 పైనే.. ఆరోజు ఏం జరుగనుంది?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్రంలో, రాష్ట్రంలో కొలువుదీరి ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇందుకు సెప్టెంబర్ 17ను పోటాపోటీగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఆ రోజు ఏం జరగబోతోందా అని అందరిలోనూ ఓ ఉత్కంఠ కనిపిస్తోంది. విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండగా.. ప్రజాపాలన పేరిట నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది.

Written By: Chai Muchhata, Updated On : September 15, 2024 3:33 pm

September 17

Follow us on

September 17 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో పేరిట జరుపుతోంది. ఏటా సెప్టెంబర్ 17 వచ్చిందంటే ప్రజల్లోనూ పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నారు. విలీనమా.. విమోచనా.. విద్రోహమా.. ఇలా ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా చెబుతుండడం వారి ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో పేరిట నిర్వహిస్తుండడం మరింత గందరగోళానికి దారితీసింది. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా నిర్వహిస్తుండడంతో ఆ రోజు ఏం జరగబోతోంది అనే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది.

మరోవైపు.. అదే రోజు హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం ఉంది. అటు సెప్టెంబర్ 17 వేడుకలు.. ఇటు నిమజ్జనోత్సవం ఉండడంతో హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ రోజు దాదాపు 25వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సిటీలో 15వేల మంది పోలీసులు, జిల్లాల నుంచి మరో 10 వేల మంది పోలీసులను రప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నగరంలో భారీ వినాయకుడైన ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్వాహకులతో పోలీసులు చర్చలు కూడా జరిపారు. మరోవైపు.. సాగర్ వైపు వచ్చే విగ్రహాలకు ఎక్కడా ఆటంకం కలగకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో పలు సూచనలు చేశారు. వీలైనంత తొరగా నిమజ్జనం పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒకే రోజు ఇలా రెండు పెద్ద పండుగలు రావడంతో అటు నగర పోలీసులకు కూడా పెద్ద టాస్క్‌లా మారింది. ముఖ్యంగా సిటీ పోలీసులకు పెద్ద చాలెంజింగ్‌గా మారింది. మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా రెండు పెద్ద పండుగలు ఒకే రోజు రావడం.. వాటిని ఎదుర్కొనే పరిస్థితి రావడంతో పోలీసులు సవాల్‌గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.